– మోదీ ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు
– నితిన్ నబీని అధ్యక్షుడిని చేస్తారని ఊహించలేదు
– మీడియాతో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్ చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నా రేవంత్ వైపు గాలి వీచిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ విలేకర్లతో బుధవారం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రధాని మోదీ ఏం ఆలోచిస్తారో రెండో వ్యక్తికి కూడా తెలియదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితీన్ నబీన్ను ఎంపిక చేస్తారని ఎవ్వరూ ఊహించలేదని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ నిలబడడం అంత ఈజీ కాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని చెప్పారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అడిగే ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదన్నారు. అయితే ఆమె ప్రస్తావిస్తున్న అంశాలు ఆమె బీఆర్ఎస్లో ఉన్నప్పుడే మాట్లాడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినా.. 38 శాతం వోట్లు ప్రజలు ఇచ్చారని ఎంపీ లక్ష్మణ్ వివరించారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఒక ఎన్నిక తీసుకుని అంచనా వేయడం తప్పు అని అభిప్రాయపడ్డారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తరువాత.. మొత్తం వన్ సైడేనని అన్నారు. ఇప్పటికే మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. బట్ట కాల్చి మీద వేస్తే ప్రజలు అంత అమాయకులు కారన్నారు. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ సమావేశాలకు ప్రజలు భారీగా వస్తున్నారని, కానీ ఆ పార్టీ 5 లేదా 6 సీట్ల కంటే ఎక్కువ గెలవదన్నారు. తెలంగాణలో హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది హేట్ స్పీచ్ కాదా అని సీఎంను ఆయన సూటిగా ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.