– ఖజానా జ్యువెలర్స్లో కాల్పులు
– బంగారం, వెండి, నగదు అపహరణ
– రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు ముమ్మరం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: హైదరాబాద్ మహా నగరంలో ఓ జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపిన దుండగులు భారీ దోపిడీకి ఒడిగట్టారు. చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ షాపులో కొంతమంది దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా దుకాణం లోపలికి ప్రవేశించిన దొంగలు తుపాకులతో బెదిరింపులకు దిగారు. అక్కడున్న సిబ్బంది బెదిరించి పెద్దఎత్తున నగలు ఎత్తుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా కాల్పులకు తెగపడ్డారు. షాపు డిప్యూటీ మేనేజర్ కాళ్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం సీసీ కెమెరాలపైనా కాల్పులు జరిపారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే భారీ దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ అనంతరం దుండగులంతా జహీరాబాద్ వైపు పారిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు జిల్లా సరిహద్దు పోలీసులను అలర్ట్ చేశారు. కాగా, నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సీపీ వెల్లడించారు. కెపిహెచ్బిలో దోపిడీకి పాల్పడిన ముఠానే ఖజానా జ్యువెలర్స్లోనూ కాల్పులు జరిపి దొంగతనం చేసినట్లు తెలిపారు. ఖజానా జ్యువెలర్స్లో భారీగానే గోల్డ్ చోరీ అయినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆరుగురు దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్ కీ అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈక్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం పది బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు దొంగల ముఠా దుకాణంలో చొరబడిందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. బంగారు ఆభరణాలు ఉన్న కౌంటర్లను దుండగులు తెరవలేకపోయారని పేర్కొన్నారు. వెండి ఆభరణాలు ఉన్న కౌంటర్లు ధ్వంసం చేసి వెండి వస్తువులు ఎత్తుకెళ్లారని తెలిపారు. వెండి ఎంత ఎత్తుకెళ్లారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. డిప్యూటీ మేనేజర్ పరిస్థితి బాగానే ఉందని వివరించారు.





