– సిలిండర్ పేలడంతో దుర్ఘటన
– మృతుల్లో నలుగురు పర్యాటకులు, మిగతావారు క్లబ్ సిబ్బంది
– ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన సీఎం
– భద్రతా లోపాలే కారణమని అనుమానం
ముంబై, డిసెంబర్ 7 : గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కో ల్పోయారు. వంట గదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉన్న బెర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు పర్యాటకులు ఉండ గా, మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ము ఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు మంటల్లో సజీవ దహనం కాగా, 20మంది పొగకు ఊపిరాడక చనిపో యారని పోలీసులు వెల్లడించారు.
ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని, విచారణలో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్బుల్లో తనిఖీలు చేపడతామని, అనుమతులు లేని వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతేడాది ప్రారంభమైన ఈ క్లబ్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





