– ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: సినిమా షూటింగ్లకు తెలంగాణను అత్యంత స్నేహపూర్వక, తక్కువ పెట్టుబడులతో అత్యంత లాభదాయకమైన గమ్యస్థానంగా మార్చే అవకాశాలపై హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం హోటల్ తాజ్ కృష్ణలో జరిగింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంలోని పరిశ్రమలు, పెట్టుబడుల సెల్ సీఈవో జయేష్ రంజన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంఐసీ అండ్ ఫిల్మ్ పర్యాటక రంగాలను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రోత్సహించడానికి స్టేక్ హోల్డర్ల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికల ద్వారా తెలంగాణను ప్రధాన ఎంఐసీఈ పర్యాటక కేంద్రంగా మార్చడంపై దృష్టి సారించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్లు, ఎగ్జిబిషన్లు ఈవెంట్ వేదికలు, ట్రావెల్, హాస్పిటాలిటీ, ఏవియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాల నుండి దాదాపు 40మంది కీలక స్టేక్ హోల్డర్లు, పరిశ్రమల ప్రతినిధులు సమావేశమై రాష్ట్ర ఎంఐసీ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ (ఎంఐసీఈ) పర్యాటక ప్రొఫైల్ అభివృద్ధికి సమగ్ర రోడ్ మ్యాప్పై చర్చించారు. పరిశ్రమ స్టేక్ హోల్డర్లతోపాటు, ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ, టీజీటీడీసీ వల్లూరు క్రాంతి, సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక లు కూడా పాల్గొన్నారు. ఈ అంశంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఆగస్టు చివరి నాటికి లేదా ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్ 27) నాటికి ప్రకటించనున్నట్లు జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఫిల్మ్ టూరిజం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) గచ్చిబౌలికి సంబంధించి స్టేక్ హోల్డర్ల సమావేశాన్ని కూడా నిర్వహించారు. సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫిల్మ్ స్టూడియోలు, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్, ఫారెస్ట్, ఎండోమెంట్స్, హెరిటేజ్ తెలంగాణ వంటి ప్రభుత్వ విభాగాల నుండి దాదాపు 20 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.





