వరి బోనస్‌తో రైతులకు రూ.25,000 ఆదా

– మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
– బీఆర్‌ఎస్ నేతలకు ఆడబిడ్డలపై గౌరవం లేదు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు ధాన్యం(వరి)పై బోనస్ పేరిట రూ.25,000 జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల శ్రమను గుర్తించి సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ను రైతుల ఖాతాలో వేస్తున్నామని అసెంబ్లీలో మాట్లాడుతూ తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లు వారి ఖాతాలో జమ చేశామన్నారు. వడ్డీ లేని రుణాల కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు సంవత్సరానికి రూ.20వేల కోట్లపైగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు ఇప్పటివరకు వడ్డీ లేని రుణాల కింద రూ.57 వేల కోట్లను మహిళల ఖాతాలో జమ చేశామని చెప్పారు. మహిళలు బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడుతుంది.. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని వివరించారు. బీఆర్‌ఎస్ నేతలకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనన్నారు. ప్రతి సందర్భంలో కేటీఆర్ మహిళల మనసు గాయపరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్ దారి తప్పి మాట్లాడుతున్నారనిపిస్తోందంటూ మహిళల అభివృద్ధి గురించి వారికి శ్రద్ధ ఉంటే వారి కేబినెట్‌లో మహిళలకు అవకాశం కల్పించేవారని అన్నారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారున్నారు. వడ్డీ లేని రుణాలు చెక్కులు చెల్లించుకుంటూ పోతున్నాం.. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం.. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు పోతూనే ఉంటాం అని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం మహిళలను మహారాణులుగా గౌరవిస్తుందని చెప్పారు. వారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఎక్కడ ఆలస్యం అవుతుందో అని ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. ఆడబిడ్డల పక్షాన బస్సు చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి క్రమం తప్పకుండా ప్రతినెలా చెల్లిస్తున్నదని వివరించారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు.. మేకలను ఎక్కడ కట్టేయాలి అని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని పదేళ్లపాటు మాటలు చెప్పారు.. బీఆర్‌ఎస్ నేతల మాటలు నమ్మి ప్రజలు చూసిచూసీ కళ్ళు కాయలు కాసాయి.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రం రాలేదు అని భట్టి ్టఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసి నిండు నిర్మాణం ప్రారంభించామన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నుంచి 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒకేసారి రూ.22,500 కోట్లు మంజూరు చేశాం.. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజా ప్రభుత్వం అమలు చేసుకుంటూ ముందుకు పోతుందని తెలిపారు. కానీ బీఆరఎస్ నేతలు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, భూమి లేని పేదలకు వ్యవసాయ భూమి పంపిణీల్లో ఏ ఒక్కటీ పదేళ్ల కాలంలో నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకT (అర్బన్, రూరల్) ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రూ.57937 కోట్లను సమకూర్చిందని తెలిపారు. మహిళా సంఘాలకు ఇప్పటి వరకు రూ.1390 కోట్ల వడ్డీలను ప్రభుత్వం చెల్లించిందని,. బీఆర్‌ఎస్ హయాంలో రూ.4051 కోట్ల వడ్డీలను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *