– మూడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
న్యూదిల్లీ, ఆగస్ట్ 7: రూ.750 కోట్ల విలువైన ‘నకిలీ’ జిఎస్టి ఇన్వాయిస్ల (fake GST Invoices)జనరేషన్ కేసులో భాగంగా జార్ఖండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలలో గురువారం ఈడి సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మూడు రాష్ట్రాల్లో సుమారు 12కి పైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జార్ఖండ్లో (Jarkhand) షెల్ సంస్థలు, అనధికార ఆర్థిక మార్గాల్లో రూ.750 కోట్ల నకిలీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ జనరేషన్కు సంబంధించిన కేసు ఇది. ఈ కేసుకు సంబంధించిన కీలక సూత్రధారి శివకుమార్ దేవరాను ఈ ఏడాది మేలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్లో అనేక మంది వ్యక్తులు మరియు సంస్థల ప్రమేయం ఉన్నట్లు సూచించే విశ్వసనీయ ఆధారాలతో ప్రస్తుతం సోదాలు చేపడుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.




