– ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతి
– మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం
– భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న కాల్పులు
భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ఛత్తీస్గఢ్్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్గఢ్లోని అంబాగఢ్-చౌకి జిల్లాలోని మొహ్లా, మన్పూర్లో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ ప్రయాస్’ పెద్ద విజయాన్ని సాధించింది. భద్రతా దళాలు ఇద్దరు ప్రధాన నక్సల్ నాయకులను హతమార్చినట్లు, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరికొంవారిలో విజయ్ రెడ్డి, లోకేష్ సలామే మరణించినట్లు సమాచారం. అయితే, వీరి మృతిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కాంకేర్ జిల్లాను ఆనుకుని ఉన్న సరిహద్దు పోలీస్ స్టేషన్ ప్రాంతమైన మదన్వాడలోని రెటెగావ్-కరెకట్టా గ్రామం మధ్య ఉన్న బండా పర్వతంలో మావోయిస్టులు, బీఆర్జీ బృందం మధ్య భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు విజయ్ రెడ్డి, డీవీసీ లోకేష్ సలామే మరణించినట్లు సమాచారం. అడవిలో కురుస్తున్న భారీ వర్షం మధ్య అడవిలోని అన్ని వైపుల నుండి బలగాలు పర్వతాన్ని చుట్టుముట్టాయి. రాజ్నంద్గావ్ ఐజి అభిషేక్ శాండిల్య ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. భారీ వర్షం మధ్య కూడా డీఆర్జీ, ఐటీబీపీ భద్రతా దళ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.





