కరెంటు ఛార్జీలే తెలంగాణ ఉద్యమానికి పునాది

కాంగ్రెస్‌ ‌పాలనలో మళ్లీ పాత రోజులు
ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించండి
ఈఆర్‌సి బహిరంగ విచారణలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌వినతి


 కరెంట్‌ ‌ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్‌ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన 10 నెలల్లోనే అదే పరిస్థితి తేవటం శోచనీయమని అన్నారు. ఈఆర్సీ ఛైర్మన్‌ ‌తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని.. ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు. విద్యుత్‌ ‌వ్యాపార వస్తువుగా చూడవొద్దని.. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా భావించాలని కోరారు. విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలోని సెస్‌ అనేది చాలా ప్రతిష్టాత్మక సంస్థ అని కేటీఆర్‌ ‌తెలిపారు. దేశంలో సహకార రంగంలో ఉన్న చాలా తక్కువ విద్యుత్‌ ‌సంస్థల్లో సెస్‌ ఒక్కటి అని చెప్పారు. మా నేతృత్వంలోని ఇక్కడి సెస్‌ ‌పాలక వర్గం బ్రహ్మండంగా పనిచేస్తోందన్నారు. డిస్కంలతో పోల్చితే మా సెస్‌ ‌పనితీరు 100 శాతం మెరుగు అని అన్నారు. గతంలో సెస్‌ ‌ను రాష్ట్ర ప్రభుత్వంలోని సంస్థల్లో కలపాలని యత్నిస్తే ఇక్కడి ప్రాంత వాసులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. వ్యవసాయ విద్యుత్‌ను 5 నుంచి 7.5 హెచ్‌పీకి పెంచాలని.. 7.5 హెచ్‌పీకి సబ్సిడీ ఇవ్వాలని కోరారు.
గతంలో ఎన్‌పీసీడీఎల్‌ ‌సగటు ధర నిర్ణయించేదని.. కానీ ఆ తర్వాత బల్క్ ‌సప్లయ్‌ ‌టారిఫ్‌ ఆధారంగా నిర్ణయిస్తోందని.. సర్‌ ‌ఛార్జీ కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. సెస్‌ ‌ను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిపుష్టమైన సబ్సిడీ ఇస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బు ప్రభుత్వం నుంచి సంస్థకు వచ్చే విధంగా గ్రీన్‌ ‌ఛానెల్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రతి మనిషికి విద్యుత్‌తో విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్‌ ‌సంస్థలకు స్వర్ణయుగంగా మారిందని కేటీఆర్‌ అన్నారు. కానీ కాంగ్రెస్‌ ‌వచ్చిన 10 నెలల్లోనే కరెంట్‌ ‌కోతలు మొదలయ్యాయని తెలిపారు. దానికి తోడు ఇప్పుడు కరెంట్‌ ‌ఛార్జీల వాతలు పెట్టే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై కరెంట్‌ ‌చార్జీల భారం మోపి.. సంపద పెంచుకోవాలనే ఆలోచన చేయటం దుర్మార్గమని అన్నారు. అదనపు ఆదాయం కోసం.. 18 వేల కోట్ల భారం మోపాలన్న కాంగ్రెస్‌ ‌సర్కారు ఆలోచనే ప్రజా వ్యతిరేకమైనదని విమర్శించారు. వివిధ కారణాలు చెప్పి 963 కోట్లు అప్‌ ‌ఛార్జీలను ప్రజలపై భారం వేయాలనుకోవటం సరికాదని హితవు పలికారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా తక్షణం రూ. 12 వందల కోట్లు పెంచుకోవటంతో పాటు డిస్కంలు చేసిన 9 ప్రతిపాదనలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డిస్కంలు చేసిన ప్రతిపాదన పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉందని విమర్శించారు. 11కేవీ, 33కేవీ, 220 కేవీ కింద నడిచే పరిశ్రమలకు సంబంధించి అన్నింటిన ఒకే కేటగిరీ లోకి తీసుకురావడం స‌రికాద‌న్నారు. . ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ద నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటు పడిందని.. చాలా పరిశ్రమలు తరలిపోతున్నాయని తెలిపారు. ఇంకా ఛార్జీలు పెంచితే పరిశ్రమలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 12 వందల కోట్లు భరించిందని.. ఈ ప్రభుత్వం ఎందుకు భరించదని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం వొత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని తెలిపారు. 10 హెచ్‌ ‌పీ వరకు సిరిసిల్ల నేతన్నలకు సబ్సిడీ ఇచ్చామన్నారు. నాయి బ్రహ్మణులు, రజకులకు, ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే ప్రయత్నం చేశామని తెలిపారు. పదినెలలకే ఎందుకు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *