– అధికారులకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్స్త్ర) విధివిధానాలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో సిఎస్ సోమవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలవుతున్న వివిధ పథకాలను, ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదికను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుండి కొంత డబ్బును జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నగదు రహిత ఆరోగ్య చికిత్స విధానం ద్వారా తమకు, తమ కుటుంబ సభ్యులకు హెల్త్ కేర్ అందించాలని ఉద్యోగులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం కలిపి 7,14,322 మంది ఈహెచ్ఎస్ ద్వారా లబ్ధి పొందనున్నారని, ఈ పథకం కోసం ఏడాదికి సుమారు రూ.1300 కోట్ల అంచనా వ్యయం అవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ధిక శాఖ అధికారులు సమన్వయంతో ఆయా రాష్ట్రాలలో కొనసాగుతున్న విధివిధానాలను ఆధ్యయనం చేసి త్వరలో నివేదికను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి డా.యోగితా రాణా, ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా చోంగ్తు, జీఏడీ కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





