– ఇరాన్ కు యూఎస్ 15 డిమాండ్లు
– 450 కిలోల యురేనియం అప్పగింత ముఖ్యం
వాషింగ్టన్, మార్చి 25: పశ్చిమాసియాలో యుద్దాన్ని ముగించేందుకు ఇరాన్తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపించేందుకు అమెరికా సిద్ధమవుతుండటం గమనార్హం. ఈ శాంతి ప్రణాళికను పాకిస్థాన్ ప్రతినిధుల ద్వారా అమెరికా ఇరాన్ (ఎసజీని)కు పంపినట్లు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. ఈ సీజ్లాన్ గురించి ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కథనాలపై వైట్హౌస్ నుంచి స్పందన రాలేదు. యుద్ధం ముగింపు కోసం ఈ ప్రణాళికలో టెహ్రాన్కు కొన్ని షరతులు విధించింది. పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య కొత్త చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు కూడా పాకిస్థాన్ ముందుకొచ్చింది. పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించిన సుమారు 50వేల మంది సిబ్బందికి తోడు మరో వెయ్యిమంది సైనికులను పంపేందుకు యూఎస్ సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ దౌత్యపరమైన చర్య చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ప్రతిపాదనలతోపాటు 2 మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్లను కూడా పశ్చిమాసియాకు పంపుతోంది అమెరికా. ఇవి సుమారు 5వేల మంది మెరైన్లు సహా వేల మంది సైనికులను తీసుకువస్తాయి. మరోవైపు ఇరాన్పై తమ సైనిక ఒత్తిడిని కొనసాగించాలని అమెరికాను పట్టుబడుతున్న ఇజ్రాయెల్కు అమెరికా చర్యలు తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ రీతిలో వాషింగ్టన్ కాల్పుల విరమణ ప్రణాళికను ముందుకు తెస్తుందని ఇజ్రాయెల్ ఊహించలేదని మీడియా కథనాలు నివేదిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదనలలో యురేనియం శుద్ధిని నిలిపివేయడం, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం సహా అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా కీలక చర్యలున్నాయి. ఇరాన్ తన ప్రస్తుత అణు సామర్థ్యాలను విచ్ఛిన్నం చేయడం. ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం. ఇరాన్ భూభాగంలో యురేనియం సుసంపన్నం చేయడానికి అనుమతించకపోవడం. సుమారు 450 కిలోల యురేనియం నిల్వలో 60 శాతాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించడం. నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు కేంద్రాలను కూల్చివేయడం.ఇరాన్ వ్యాప్తంగా ఐఏఈఏకు పూర్తి పారదర్శకత కల్పించడం. ఇరాన్ తన ప్రాంతీయ మధ్యవర్తిత్వ కార్యకలాపాలను నిలిపివేయడం. మిత్రపక్ష మిలీషియాలకు మద్దతును నిలిపివేయడం. హోర్ముజ్ జలసంధిని ప్రపంచవ్యాప్త రవాణాకు తెరిచి ఉంచడం.ఇరాన్ క్షిపణి పరిధిని, పరిమాణాలను పరిమితం చేయడం. భవిష్యత్తులో క్షిపణి వినియోగం కచ్చితంగా ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించడం. పైన పేర్కొన్న పలు కీలక ప్రతిపాదనలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్కు అమెరికా పంపినట్టు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





