– 23నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులకు అవకాశం
– మే 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక టిజి ఎడ్సెట్-2026 నోటిఫికేషన్ను వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన కేయూ, దరఖాస్తుల పక్రియ నుంచి ఫలితాల విడుదల వరకు పూర్తి షెడ్యూల్ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. రూ.250 ఫైన్తో ఏప్రిల్ 23 వరకు, రూ.500 ఫైన్తో ఏప్రిల్ 27 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులను అనుమతించనున్నారు. మే 12న రాష్ట్రవ్యాప్తంగా ఎడ్సెట్ నిర్వహించనున్నారు. అభ్యర్థుల సంఖ్యనుబట్టి ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష పూర్తయిన మూడు రోజుల్లోనే అంటే మే 15న అధికారులు ప్రాథమిక కీని విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించిన అనంతరం, మే 30వ తేదీన తుది ఫలితాలను వెల్లడించనున్నారు. బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



