– బీజెపిలో రాముడి రాజకీయం
– ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో కాలం చెల్లింది
– ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వంద సీట్లు సాధిస్తాం
– టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్
మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: రాష్ట్ర రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాల కుట్రలు పన్నినా కాంగ్రెస్పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. అందుకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ లో కొంత కాలంగా అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కవిత వేరు కుంపటి పెట్టుకోవడంతో బీఆర్ఎస్ పరిస్థితి రోడ్డున పడిందన్నారు. పార్టీలో కేటీఆర్, హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలకు దూరమై ఫామ్హౌస్కే పరిమితమయ్యారు. ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ రోజురోజుకూ దిగజారుతోందని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతోంది. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఆ పార్టీని దూరం పెడుతున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందనిధీమా వ్యక్తం చేశారు. 100 సీట్లు ఖాయం అని అన్నారు. రాముడేమైనా బీజేపీ జాగీరా.. వాళ్ల పార్టీల సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. సన్న బియ్యం పథకం దేశంలోనే చరిత్రాత్మకమన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ కడుతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో నేతల జేబుల్లోకి డబ్బులు వెళ్లాయన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీం సక్సెస్ గా నడుస్తోందన్నారు. బీజేపీ రాష్టాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వట్లేదన్నారు. కేంద్రం లాభాల్లో ఉన్న సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. 12 ఏండ్లలో కేంద్రం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇందిగాంధీ నుంచి రాహుల్ వరకు పేదల కోసం పనిచేస్తున్నారన్నారు. దోచుకున్న సొత్తులో వాటాల గొడవలతో బీఆర్ఎస్ రోడ్డున పడిందని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ తో రూ.5 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయన్నారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ కర్యాక్రమంలో మంత్రి వివేక్తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.