కాలుష్యకారక పరిశ్రమలను తెలంగాణలో ప్రోత్సహించొద్దు

-వాటికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి అడవిని కాపాడాలి
-2013 బదులు 2017 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం అన్యాయం
-అన్ని భూ సేకరణ నోటిఫికేషన్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలి
-సిటీ పేరుతో ప్రభుత్వం 35 వేల ఎకరాల భూ సేకరణ చేయడం అన్యాయం
-తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్
 ఫార్మా సిటీ, ఇథనాల్ కంపెనీలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు అత్యంత కాలుష్య కారక పరిశ్రమలు అని వాటిని తెలంగాణలో ప్రోత్సహించకూడదని టీపీ జేఏసీ(తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ) కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. వాటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ప్రజాస్వామిక తెలంగాణ కోసం మన కృషి కొనసాగిద్దాం-తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి నమూనా ప్రజానుకూలమేనా’ అనే అంశంపై తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ), ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(ఎన్ఏపీఎం) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో భూసేకరణకు పూనుకున్నప్పుడు 2013 భూసేకరణ చట్టానికి బదులు 2017 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం అన్యాయం అన్నారు.
అన్ని భూ సేకరణ నోటిఫికేషన్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాంటి మూడు నగరాల మధ్యలో ఫ్యూచర్ సిటీ పేరుతో నాల్గవ సిటీ అనవసరం అని, దాని కోసం 35,000 ఎకరాల భూ సేకరణ చేయాలనుకోవడం అన్యాయం అన్నారు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండం అడవిని నావీ రాడార్ స్టేషన్ కోసం ఇవ్వడం అన్యాయం అన్నారు. వెంటనే ఆ అనుమతులను రద్దు చేసి అడవిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రజా శాస్త్రవేత్త డాక్టర్ బాబూరావు, టీపీజేఏసీ కో-కన్వీనర్లు కన్నెగంటి రవి, అంబటి నాగయ్య, రవి చంద్ర, మైసా శ్రీనివాస్, డాక్టర్ వనమాల, ఎన్ఏపీఎం జాతీయ కమిటీ సభ్యులు మీరా సంఘమిత్ర, డీబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పి.శంకర్, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు సరస్వతి కవుల, పర్యావరణ వేత్త నిఖిత, చిత్తనూరు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ బండారు లక్ష్మయ్య, దిలావేర్ పూర్ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆర్.విజయ్ కుమార్, సామాజిక కార్యకర్త ఖలీదా ఫర్వీన్, న్యాయవాది అఫ్సర్ జహాన్, స్వతంత్ర పరిశోధకులు ఉషా సీతా లక్ష్మీ, మహిళా రైతుల హక్కుల వేదిక ఆశాలత, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి విస్సా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *