మంథనిలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి

– ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌  ఆధ్వర్యంలో డిజిటల్‌ తరగతులు ప్రారంభం

– ఐటి, పరిశ్రమలు, శాసనససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి టౌన్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని ఐటీి, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి మంథని మున్సిపాలిటీలో ఆయన గురువారం విస్తృతంగా పర్యటించారు. మంథని మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో నిర్మించనున్న ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణంలో ఎంపీపీిఎస్‌ బాలికల పాఠశాలలో టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ (మంచు లక్ష్మి ఫౌండేషన్‌) ఆధ్వర్యంలో డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందాలని సేవలందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటుతోపాటు పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పాటునందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పటు చేస్తూ పిల్లలకు మెరుగైన బోధన అందించేందుకు సహకరిస్తున్న టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ స్థాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు డిజిటల్‌ తరగతులను, మూడేళ్ల వరకు ఈ సంస్థ అందించే కరికులంను సద్వినియోగం చేసుకుంటూ పిల్లల్లో మంచి మార్పు తీసుకు రావాలని ఆకాంక్షించారు. అవసరమైన పాఠశాలల్లో ప్రహరీ, అదనపు తరగతులు, టాయిలెట్స్‌ అవసరమైన మరమ్మతు పనులు చేపట్టామని చెప్పారు. ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’ స్థాపకురాలు, ప్రముఖ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ మంథనిలో 6 తరగతి గదులను డిజిటలైజ్‌ చేశామని, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో తమ సంస్థ ద్వారా 51 తరగతి గదులలో డిజిటల్‌ సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో సంస్థను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్‌, మంథని రామగిరి కమాన్‌పూర్‌ మండలంలో ఎంపికైన 205 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నన్నయగౌడ్‌, జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి, మంథని మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ వెంకన్న, ఆర్డీవో సురేష్‌, సహకార సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్‌, తహసిల్దార్‌, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *