అభివృద్ధి పేరు చెప్పి విధ్వంస‌కాండ‌

– మూసీ పేరిట లూటిఫికేష‌న్‌ను వ్య‌తిరేకిస్తున్నాం
– చేప‌ట్టేది మూసీ ప్ర‌క్షాళ‌నా?  లేక సుంద‌రీక‌ర‌ణా?
– ప్ర‌క్షాళ‌న అయితే పేద‌ల ఇళ్లు కూల‌గొట్టుడేంది?
– ప్రజ‌ల అభిప్రాయం తెలుసుకోకుండా ప్ర‌ణాళికా ర‌చ‌న ఏంది?
– మీ అధ్య‌య‌నం బ‌య‌ట‌పెట్టండి
– బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు డిమాండ్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12: ఈరోజు మూసీ బ్యూటిఫికేషన్ మీద ముఖ్యమంత్రి ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రెసెంటేషన్ ఇస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా, బాధితుల పక్షాన కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నాం. సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డిని హ‌రీష్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ  మూసీ పునరుజ్జీవనానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు.. కానీ మూసీ పేరిట రేవంత్‌ చేస్తున్న లూటిఫికేషన్ కు మాత్రమే మేం వ్యతిరేకమ‌న్నారు. సుందరీకరణ పేరిట వేలాదిమందిని నిరాశ్రయులుగా చేస్తుండటాన్ని వ్య‌తిరేకిస్తున్నామ‌న్నారు. మొదట మూసీ బ్యూటీఫికేషన్ కు శ్రీకారం చుట్టింది బిఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ రూ.4వేల కోట్లతో 32 ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో పోసీ శుద్ది చేయాలనీ ప్రణాళికలు వేశాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే తుగ్లక్ పాలన గుర్తుకు వస్తున్నద‌న్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ది పథంలో నడిపిస్తే.. రేవంతు అధోగతి పాలు చేస్తున్నడ‌న్నారు. ఒకసారి మూసీ సుందరీకరణ అంటడు.. మరోసారి మూసీ ప్రక్షాళన అంటడు, ఇంకోసారి మూసీ పునరుజ్జీవం అంటడు.. పూటకో పేరు మార్చుతూ రోజుకోచోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు మీకు ఎవరు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. మూసీ అభివృద్ది పేరు చెప్పి హైదరాబాద్ లో అసలు ఎందుకు ఈ విధ్వంస కాండను కొనసాగిస్తున్నావు. మీరు చేస్తున్నది ఎకలాజికల్ ప్యూరిఫికేషనా? లేదా ఆస్తటిక్ బ్యూటిఫికేషనా? స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నా రు.మూసీ ప్రక్షాళన మీద చిత్తశుద్ది ఉన్న వారెవరూ మొద‌టే పేదల ఇండ్ల మీద పడర‌న్నారు. వికారాబాద్ నుంచి ఇక్కడి వరకు మురుగు నీటిని ఆపకుండా ప్రక్షాళన ఎలా చేస్తవు రేవంత్ రెడ్డి.. వికారాబాద్ లో ఎస్టీపీ పని చేయడం లేదు. ముందు అది చూడు. ఒక దిక్కు ఖజానా ఖాళీ అంటూనే.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా లక్షా 50వేల కోట్లకు టెండర్ పెట్టిండు.. ఇక్కడ పాలన చేత గాదు గానీ, మా పాలన అద్భుతం అని పక్క రాష్ట్రాల్లో కోట్లు ఖర్చు చేసి పేపర్ ఆడ్స్ ఇస్తడు. రేవంతు ప్రాధాన్యంలో రైతులు లేరు, ఉద్యోగులు లేరు, విద్యార్థులు లేరు, మహిళలు లేరన్నారు.  రేవంత్ రెడ్డి గోబెల్స్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కూర్చొని ప్రణాళిక రచిస్తడట. అంటే ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఇన్ని రోజులు పేదల ఇండ్లు కూల్చినవా? ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండానే బస్తీ ప్రజల గుండెల్లో భయాందోళనలు సృష్టించినవా? నీకు నిజంగా మూసీని బాగు చేయలనే చిత్తశుద్ది ఉంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరుగు. అక్కడి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకో. ఫైవ్ స్టార్ హోటల్లలో, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని కాగితాలు తిరగేస్తే ఏం ప్రయోజనం? మూసీని బాగు చేయాలన్నదే నీ లక్ష్యం అయితే ముందు నువ్వు ఎస్టీపీలు పెట్టాలె. మురుగు నీటిని శుద్ది చేసి, మూసీలో కలిసేలా చూడాలె. అది చేయకుండా మొద‌ట‌నే పేదల ఇండ్ల మీద ఎందుకు పడ్డట్లు. నీకు విజన్ లేదు, ప్రణాళిక లేదు.. ఉన్నది ఒక్కటే రియల్ ఎస్టేట్ దందా? నీ రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్ల మీద పడ్డవు.

లక్ష మంది జీవితాలు కూల్చుతా అంటున్నడు

రేవంతు ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ప్రకారం.. 3279.19 ఎకరాల్లో ఉన్న 10,017 నిర్మాణాలను కూల్చుతడట. అంటే లక్ష మంది జీవితాలు కూల్చుతా అంటున్నడు. గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఇన్ని ఇండ్లు కూల్చడం అవసరమా? రెండున్నరేండ్లలో పది ఇండ్లు కూడా కట్టని రేవంతు రెడ్డికి పది వేల ఇండ్లను కూల్చే హక్కు ఎవరు ఇచ్చారు.  ఒకవైపు గల్ఫ్ దేశాల్లో బాంబులు వేస్తూ ఇండ్లు కూల్చతుంటే, ఇక్కడ ఏ యుద్దం లేదు, బాంబులు లేవు కానీ రేవంత్ రెడ్డి బుల్‌డోజర్లతో విధ్వంసం చేస్తున్నడు. ఎలాంటి డీపీఆర్‌ లేకుండా, ప్రణాళిక లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చుతూ, భయబ్రాంతులకు గురి చేయడం ఏమిటి? రేవంతు బుల్డోజర్ రాజ్ రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? ఉత్తర ప్రదేశ్ లో జరిగే బుల్డోజర్ రాజ్ కు, తెలంగాణలో జరిగే బుల్డోజర్ రాజ్ కు తేడా ఏముంది? దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. రేవంతు రెడ్డి 8 సూటి ప్రశ్నలు.. 1. అసెంబ్లీ వేదికగా జనవరిలో సీఎం ఇచ్చిన సమాధానం ప్రకారం, హిమాయత్ సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు అధ్యయనం చేసి డిపిఆర్ ఇవ్వడానికి 18నెలలు పడుతుంది అన్నరు. మరి డిపిఆరే రాకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చినవు? ఎందుకు పేదల ఇండ్లు కూలగొడుతున్నావు? 10,017 ఇండ్లు కూల్చుతమని గజిట్ ఎట్లా ఇచ్చినవు? 2. అసలు మీరు చేస్తున్నది మూసీ నది ప్రక్షాళననా? మూసీ సుందరీకరణనా?  అసలు ఏం చేస్తున్నావు సమాధానం చెప్పు? 3. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం 9మీటర్లు, మరొక ప్రభుత్వం 30 మీటర్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 మీటర్లు అంటున్నాడు. అసలు బఫర్ ఎలా నిర్ణయించారు. ఉంటే స్టడీ బయట పెట్టండి? అసలు మూసి నుండి ఎలా కొలుస్తారు? 4. ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే కనీసం వంద ఏళ్ల డేటా తీసుకొని చేస్తాం. హైడ్రాలజికల్ లేదా ఫ్లడ్ వాటర్ స్టడీ చేసారా? చేస్తే బయట పెట్టండి. 5.జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏడీబీ లోన్ రూ.4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి ఒప్పుకున్నది, మంజూరు అయ్యింది అని చెప్పారు. కానీ ఏడీబీ డిసెంబర్ 15లో ఇంకా డీపీఆర్ మాకు సమర్పించలేదు, మా పద్దతి పాటిస్తేనే రుణం ఇస్తామని చెప్పింది. జనవరి 23 నాడు ఏం అన్నది.. మాకు డీపీఆర్ రాలేదు, మేం లోన్ సాంక్షన్ చేయలేదు అని చెప్పింది. నిన్న గాక మొన్న మార్చి 11 నాడు ఇచ్చిన లేఖలో మేం ఇంకా లోన్ సాంక్షన్ చేయలేదు అని చెప్పింది. ఇదీ వాస్తవం. మరి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దం చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇలా అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎలా నమ్ముతారు? పవిత్రమైన శాసనసభనే తప్పుతోవ పట్టించిండు రేవంత్ రెడ్డి? లోన్ మంజూరు అయ్యిందా లేదా? అసెంబ్లీని తప్పుదోవ పట్టించినవా స్పష్టం చేయి? లేదంటే అసెంబ్లీలో ప్రవిలేజ్ మోషన్ ఇస్తాం. 6. ఇప్పటికే చాదర్ ఘాట్ లో మూసీలో 300 ఇళ్లు కూల్చారు. యూపీఏనే తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నడు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల‌కు పంపినవు. భూసేకరణ చట్టం ప్రకారం ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పండి? ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే ఏం చేయలేదు. నువ్వు చేస్తవని ప్రజలు ఎట్ల నమ్ముతారు? మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులు నిన్ను ఎట్ల నమ్ముతారు? మాట తప్పని నైజం కేసీఆర్ ది అయితే మాట తప్పడమే రేవంతు నైజం అని పేరు తెచ్చుకున్నడు. 7.మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా అన్నవు. సంతోషం. మధు రిడ్జ్ ఒక్కటే కాదు కదా? మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నయి. పది వేల ఇండ్లు కూలగొడుతా అంటున్నవు. వీళ్లకు కూడా అదే పద్దతిలో స్థలం కేటాయిస్తవా? బ్యాంకుల్లో నిధులు జమ చేస్తవా? పదివేల మందికి ఇదే తీరుగా ఇళ్లు కట్టిస్తవా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 8.మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాదు, మెట్రో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నయి.. ఇవన్నీ కూల్చుతావా? నీ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయండి. నిన్న నన్ను మూసీ జన అందోళన్ బాధితులు వచ్చి కలిసారు. వారిని ఈరోజు మీ మీటింగ్ ఉందని హౌజ్ అరెస్టు చేసారు. నిర్బందాలు, భయాందోళనల మధ్య ఈరోజు సీఎం మీటింగ్ పెడుతున్నడు. బిజేపీ వాళ్లకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా.. మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ఆను హ్వానిస్తాం అంటున్నారు. మూసీ పేరిట రేవంతు చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి బిజేపీ సహకరిస్తున్నదా? పేదల ఇండ్లు కూల్చడాన్ని సమర్థిస్తుందా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. కిషన్ రెడ్డి బస్తీ నిద్ర అని ప్రచారం చేసారు. అందులో చిత్తశుద్ది లేదా? మూసీ పేరిట జరుగుతున్న చేస్తున్న రేవంత్ దోపిడి ఎందుకు అడ్డుపడటం లేదు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *