– తీసుకొచ్చిన మంచి మార్పే గౌరవాన్ని తెస్తుంది
– మానవత్వంతో నాయకత్వ లక్షణాలతో మెలగాలి
– నిర్లక్ష్య నిర్ణయం ఖరీదు ఒక జీవితం
– యువ సివిల్ సర్వెంట్లకు డిప్యూటీ సి.ఎం. భట్టి దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కాక ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవడం వల్లనే సివిల్ సర్వీసెస్ హోదాకు న్యాయం చేయగలిగిన వారుగా నిలిచిపోతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ ఆర్డి)లో ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అధికారులు 10 వారాల శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సభకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంసీఆర్హెఆర్డీ వైఎస్ ఛైర్ పర్సన్ శాంతకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ ప్రతిరోజూ కార్యాలయాన్ని వదిలి వెళ్లే ముందు మిమ్ములని మీరు ఒక ప్రశ్న వేసుకోండి.. మీ పని ద్వారా ఎవరి జీవితంలో అయినా ఒక మంచి మార్పు, గౌరవాన్ని తీసుకువచ్చిందా అని.. అవును అని సమాధానం వస్తే ఆరోజు మీరు ఎంత కఠిన పరిస్థితుల్లో విధి నిర్వహణ చేసినా మీరు విజయం సాధించినట్టేనన్నారు. నిజాయతీతో సేవ చేయండి.. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి.. మానవత్వంతో వ్యవహరించండి.. నాయకత్వంతో ముందుకు సాగండి.. అని శిక్షణలో ఉన్న అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి శిక్షణ పూర్తి చేసుకున్న 203 మంది అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ రోజు కేవలం ఆనందపడే కార్యక్రమం మాత్రమే కాదు. ఇక్కడనుంచి బాధ్యతలు, బదిలీలు, క్లిష్టమైన సమస్యలు, ప్రజలకు సంబంధించిన ఫైళ్లు, ఉంటాయి. మీరు సరైన సమయంలో స్పందించాల్సిన అంశాలు ఉంటాయి. విధి నిర్వహణలో మీరు నిర్లక్ష్యంతో తీసుకునే ఒక నిర్ణయం ఒకరి జీవితాన్ని ఏళ్లపాటు ప్రభావితం చేయగలదు.. అందువల్ల నిబద్దతతో విధి నిర్వహణ చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. పాలనలో ఒత్తిడి, కఠినమైన సందర్భాలు, మానవీయతతో కూడిన నిర్ణయాలు, ప్రజాశ్రేయస్సు కోసం శ్రమించే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రశంశలు, విమర్శలు కూడా వస్తాయి. అన్నింటిని.. ప్రజల కోసమే అన్నభావనతో ముందుకు వెళ్లాలని ఆయన చెప్పారు. యువ సివిల్ సర్వెంట్స్ గా అడుగు పెడుతున్న ఈ సమయం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగవంతంగా అభివృద్ధిని సాధిస్తోంది. ప్రజలు మరింత సమాచారం కలిగి ఉన్నారు. అదేవిధంగా ప్రశ్నిస్తున్నారు. మీరు నిరంతరం నేర్చుకోవాలి. అవసరమైతే పాత విషయాలను వదలిపెట్టాలి. ఎప్పటికప్పుడు మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందాలని సూచించారు. ఈ మారుతున్న ప్రపంచంలో మూడు అంశాలు మాత్రం ఎప్పటికీ మారకూడదన్నారు. నడవడిక , నమ్మకత్వం , కరుణ , ఇవి మృదువైన విలువలు కావు. ఒక అధికారి సంపాదించగలిగే అత్యంత కఠినమైన ఆస్తులు ఇవే, అదే సమయంలో కోల్పోవడం కూడా అత్యంత సులభమైనవే అన్నారు. విధానం మరియు వాస్తవం మధ్య, రాష్ట్రం మరియు అత్యంత బలహీనమైన పౌరుడి మధ్య మీరు నిలబెట్టబడ్డారు అన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. మీ విజయాన్నిమీరు అక్కడ ఉండటం వల్ల ఎన్ని జీవితాలు నిశ్శబ్దంగా సులభమయ్యాయో దానితో కొలుస్తారు అని తెలిపారు. ఈ వయసులో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉన్నప్పుడు కార్పొరేట్ రంగం లేదా సొంత వ్యాపారాలు నిర్వహించుకోకుండా పౌరులకు సేవ చేయాలని ఎంచుకున్నారు. ఆ ఎంపికకు విలువ ఉంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుందని అన్నారు. మొదటిసారి సేవలో చేరినప్పుడు ఉన్న లక్ష్యాన్ని, అనుకోకుండా అయినా మరిచిపోవడం జరుగుతుందని తెలిపారు. దీని నుంచి మిమ్ములను మీరే కాపాడుకోండి. సాధారణ ప్రజలతో ఎప్పుడూ సంబంధం కొనసాగించండి. గౌరవంతో కలవండి. ఓర్పుతో వినండి. పౌరులతో గడిపే సమయం పని నుంచి దూరం చేసే విషయం కాదు అన్నారు. అదే మీ పని అసలైన ఉద్దేశ్యం అని కూడా వివరించారు. ఈ ప్రాంగణాన్ని మీరు జ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆశతో విడిచిపెడుతున్నారు.. ఇకమీకు అవసరమయ్యేది వివేచన, వినయం, నైతిక ధైర్యం అని వివరించారు. నిజాయతీతో సేవ చేయండి.. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి.. సానుభూతితో నాయకత్వం వహించండి అని శిక్షణ అధికారులకు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





