– పార్లమెంట్ ఎప్పటికీ ‘సుప్రీమ్’ కాదు
– రాజ్యాంగం కింద మూడు వ్యవస్థలు పనిచేస్తాయి
– రాజ్యాంగం కింద మూడు వ్యవస్థలు పనిచేస్తాయి
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్
ముంబై, ప్రజాతంత్ర, జూన్ 26: భారత్లో రాజ్యాంగమే సర్వోన్నతమని.. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు దాని కిందే పనిచేస్తాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్ అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు లేదా భావిస్తున్నట్లు పార్లమెంట్ సుప్రీం కాదన్నారు. ప్రజాస్వామ్యం ఛత్రం కిందపార్లమెంట్ ఒకటని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్కు అధికారాలు ఉన్నాయి. కానీ, రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదన్నారు. భారత 52వ సీజేఐగా గవాయ్ గత నెల బాధ్యతలు స్వీకరించారు. తూర్పు మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో ఏది అత్యున్నతమైందని తరచూ చర్చ తలెత్తుతోందని గవాయ్ అభిప్రాయపడ్డారు. ‘ చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందని అంటారు. కానీ, నా ఉద్దేశంలో భారత రాజ్యాంగమే సర్వోన్నతమైంది. ప్రజాస్వామ్యంలోని మిగిలిన మూడు విభాగాలు దానికిందే పనిచేస్తాయి. మనం విధులు నిర్వహిస్తున్నామని న్యాయమూర్తులు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. మనం ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం. కేవలం మనకు అధికారం మాత్రమే లేదు. బాధ్యతలు కూడా ఉన్నాయి. తీర్పుల గురించి ప్రజలు ఏమనుకొంటున్నారు అన్నది న్యాయమూర్తులను ప్రభావితం చేయకూడదు. మనం స్వతంత్రంగా ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. తాను రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు అండగా నిలుస్తానన్నారు. బుల్డోజర్ న్యాయంపై తాను ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు. ప్రతిఒక్కరికీ నివసించేందుకు ఇల్లు ఉండాలన్నారు. చిన్నప్పుడు తాను ఆర్కెటెక్ట్ కావాలనుకొన్నట్లు చెప్పారు. కానీ, తాను లా చదవడం తన తండ్రి కోరిక అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన అరెస్టు కావడంతో.. లా చదవలేక పోయారన్నారు.


