– భారీ వర్షంలో చిక్కుకున్న యువతికి సాయం
~ లభినందన పత్రం అందించిన టీజీహెచ్ఆర్సీ చైర్పర్సన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: నగరంలో గత వారం కురిసిన భారీ వర్షాల సమయంలో ఒక యువతిని రక్షించి, సురక్షితంగా ఇంటికి చేర్చిన హైదరాబాదు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్వర్మను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఎస్) చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ప్రశంసించారు. ఈమేరకు ఆయనకు మంగళవారం అభినందన పత్రం అందజేశారు. ఈనెల 4వ తేదీ సాయంత్రం కురిసిన భారీ వర్షంతో బంజారాహిల్స్ రహదారులు నడుము లోతు వరద నీటితో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో టీజీహెచ్ఎస్ చైర్పర్సన్ భద్రతా బృందంలో పైలట్-కమ్-ఎస్కార్ట్ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్వర్మ రోడ్ నెం.3 వద్ద బస్ స్టాప్లో ఒంటరిగా నిలబడి భయాందోళనకు లోనైన 22 ఏళ్ల యువతి నైనికను గమనించారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకుంటూ రామంతపూర్లో కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చిన నైనిక తన అన్న వదిలి వెళ్ళిన తర్వాత పెరుగుతున్న వరదలో చిక్కుకుంది. నీటి భయం, మొబైల్ ఫోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులను సంప్రదించలేని పరిస్థితిలో ఉన్నది. ఈ సమయంలో శ్రీధర్వర్మ నడుము లోతు నీటిలోకి వెళ్లి ఆమెకు తన జెర్కిన్ ఇవ్వడంతోపాటు ధైర్యం చెప్పి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన స్వయంగా నైనికను వనస్థలిపురంలోని ఆమె ఇంటికి క్షేమంగా చేర్చారు. ఈ విషయం పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందింది. దీనిపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ శ్రీధర్వర్మ చేసిన సాయం విధి నిర్వహణకు మించి మానవత్వం, కర్తవ్యబద్ధతకు ప్రతీక అని అభినందించారు. ఆయన చూపిన నిస్వార్థ సేవ బాధలో ఉన్న పౌరురాలి సురక్షితత్వం, గౌరవాన్ని కాపాడడమేకాక పోలీసింగ్, మానవ హక్కుల పరిరక్షణలోని అసలు స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నదని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





