– ఏడు మున్సిపాలిటీలూ కాంగ్రెస్ ఖాతాలోనే
– ఇక్కడి వ్యవసాయం దేశానికే ఆదర్శనం
-ఇక్కడే రైతు సమస్యలపై పోరాటం చేశా
– బీఆర్ ఎస్ పాలనలో చెత్తకుప్పగా మారింది
– జిల్లాలో విద్యా సంస్థలకు రూ.600 కోట్లు మంజూరు చేశాం
– అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ ఎస్ నేతలు
– నిజామాబాద్ బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. నిజామాబాద్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి ఈ నిజామాబాద్ బిడ్డ. మండవ వెంకటేశ్వర రావు, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్లు మంత్రులుగా పని చేసినా చిన్న మచ్చ లేదు. 12 ఏళ్లు ప్రధానిగా మోదీ , 10 ఏళ్లు ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉండి నిజామాబాద్ లో సమస్యలు పరిష్కారం కాలేదు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ చెత్తకుప్ప గా మారింది.. సమస్యలు మరింత జఠిలం అయ్యాయన్నారు. నిజామాబాద్ వ్యవసాయానికి మారు పేరు. క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం వస్తుందన్న నానుడి ఉండేది. ఇక్కడి వ్యవసాయం తెలంగాణతో పాటు దేశానికి ఆదర్శమన్నారు. రైతు సమస్యల పైన నిజామాబాద్ రైతుల పోరాటం దేశానికి ఆదర్శం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి , డీ.శ్రీనివాస్ సారథ్యంలో 2004,2009 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో నేను పీసీసీ అధ్యక్షుడు గా, మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ నుఅ ధికారంలోకి తెచ్చామన్నారు. 2029 లో సీఎం గా నేను , పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ లో రైతు సమస్యలపైన పోరాటం చేశాననన్నారు. నా మనసులో నిజామాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. జిల్లాకు అవసరమైన నిధులు మంజూరు చేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తా. జిల్లాలో వివిధ విద్యాసంస్థల కోసం 600 కోట్లు మంజూరు చేశాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో 1045 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కి చెందిన వారే 90 శాతం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులే ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా బీఆర్ఎస్ నాయకులు అభివృద్దిని అడ్డుకున్నారు. నిజామాబాద్ లో రెండు సార్లు ఎంపిగా బీజేపీ కిచెందిన ధర్మపురి అర్వింద్ కు అవకాశం ఇచ్చారు..ఆయన మోదీ జపం చేస్తున్నారు. నిజామాబాద్ గల్లీలో మోరీలు తీయాలంటే మోదీ అవసరమా అని ప్రశ్నించారు. నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ పథకంలోకి ఎందుకు ధర్మపురి అర్వింద్ తీసుకురాలేకపోయాడని ప్రశ్నించారు. నిజామాబాద్ కు ఎయిర్ పోర్టు ఎందుకు తీసుకురావడం లేదు. నిజామాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు నిధులు ఇస్తే మేం వద్దని అన్నామా? ఏం నిధులు తెచ్చారని ఓట్లు అడుగుతున్నారు? మూడు సార్లు మోదీ ప్రధాని అయినా నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ చేయలేకపోయారన్నారు. కేసీఆర్, హరీష్ రావును జైలు లో పెట్టి చిప్ప కూడు తినిపించాలని ధర్మపురి అర్వింద్ అంటుంటాడు. శాసనసభ సభలో చర్చ పెట్టి కాళేశ్వారాన్ని సీబీఐకి ఇచ్చాం. ఇప్పటి వరకు సీబీఐ పట్టించుకోలేదు. కిషన్ రెడ్డి ఏ బొక్కలో దాక్కున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావును చర్లపల్లి జైలులో పెట్టకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎందుకు ధర్మపురి అర్వింద్ మాట్లాడలేదు… కిషన్ రెడ్డి కేసీఆర్ ను ఏ రకంగా కాపాడుతున్నాడో తెలియడం లేదా? కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల గోదావరి పాలు అయ్యాయి.. కాళేశ్వరం కూలేశ్వరం అయింది. నిజామాబాద్ రైతుల ఆత్మగౌరవంతో పంటలు పండించుకుంటున్నా రంటే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనేనన్నారు. కేసీఆర్, హరీస్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో బీజేపీ నాయకులు చెప్పాలి. ఎంపీ ధర్మపురి అర్వింద్ కు పరపతి లేదు.. మోదీ దగ్గర ఆయన మాట చెల్లదన్నా రు. నిధులు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే లేదా మున్సిపల్ శాఖ మంత్రినైనా నా దగ్గరకు రావాలి.. నిధులు ఇచ్చే బాధ్యత నాది. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది. గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండటం సాధ్యం కాదన్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మనోళ్లు గెలవాలి.. అప్పుడే పనులు జరుగుతాయన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు వదులుకోవద్దన్నారు. నిజామా బాద్ లో కాంగ్రెస జెండా ఎగరాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నన్ను రేవంతుద్దీన్ ముస్లింపేరుతో పిలిచారు. బ్రిటిష్ వాళ్ల తర్వాత 100 ఏళ్ల వరకు బీసీ కులగణన జరగలేదు.
కులగణన చేసినందుకు రేవంత్ గౌడ్ అని గతంలో మహేష్ గౌడ్ నన్ను వ్యాఖ్యానించారు..నేను సంతోషంగా స్వీకరించాను. ఎస్సీ వర్గీకరణ కు శాశ్వత పరిష్కారం చూపించాం.. అందుకు మంత్రి దామోదర రాజనర్సింహా రేవంత్ మాదిగ అని నన్ను వ్యాఖ్యానించారు.. నాకు సంతోషం అయిందన్నారు. వాకిటి శ్రీహరి 30 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్త గా పనిచేశారు..ఆయనను మంత్రి ని చేస్తే ముదిరాజ్ వర్గం నన్ను రేవంత్ ముదిరాజ్ అని వ్యాఖ్యానించింది. అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభ కు పంపిస్తే నన్ను రేవంత్ యాదవ్ అని పిలిస్తే సంతోషపడ్డానన్నారు. స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తాన్నందుకు సర్దార్ రేవంత్ సింగ్ అని నన్ను సిక్కు సోదరులు పిలిచారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది.. ముస్లిం వర్గానికి కాంగ్రెస్ అనేక పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు. షబ్బీర్ అలీ నిజామాబాద్ లో గెలవకపోయినా పదవి ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రి వర్గంలోకి తీసుకున్నామన్నారు. 8 మంది మైనార్టీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇచ్చాం.
రేవంతుద్దీన్ అని పిలిచినా పర్హలేదు.. నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు..అన్నికులాలు,మంతాలను సమన్వయం చేసుకుని అభివృద్ధి పథం వైపు తీసుకువెళ్తానన్నారు. తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తానన్నారు. కిషన్ రెడ్డి ఎందుకు కేసీఆర్ ను కాపాడుతున్నాడని ప్రశ్నించారు. కల్వకుంట్ల కిషన్ రావు గా కిషన్ రెడ్డి మారాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు మరో దత్తత పుత్రుడు కిషన్ రావన్నారుమీ కిషన్ రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని . రామచంద్రరావును కోరారు. కార్పొరేషన్ లో బీజేపీ ఓట్లు అడగాలంటే నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ గా ప్రకటించాలన్నారు. బీఆర్ఎస్ , బీజేపీ ఒక్కటే.. ఇద్దరి వీణావాణి బంధం.. పెవికాల్ బంధమన్నారు. బీజేపీ కి ఓటు వేసినా, బీఆర్ఎస్ కు ఓటు వేసినా ఒక్కటే.. ఓటు మూసీలో వేసినట్లేనన్నారు. రాష్ట్రంలో ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. నిజామాబాద్ కు ఎయిర్ పోర్టు తీసుకువచ్చే బాధ్యత మాదేనన్నారు. వరంగల్, ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్టు తెచ్చాం. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. మేం లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తుచేశారు.3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ 50 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 500 రూపాయలకే 50 లక్షల కుటుంబాలకు సిలిండర్ కు ఇస్తున్నాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం.. ఇప్పటి వరకు 9 వేల కోట్ల చెల్లించామన్నారు. శిల్పారామం పక్కనే మహిళా సంఘాలకు స్థలం ఇచ్చాం. వరి పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





