ఏపీ ట్రాప్‌లో పడిపోతున్న‌ కాంగ్రెస్‌ ‌

– మా హయాంలోనే 90శాతం పనులు పూర్తి
– పది శాతం పనులు పూర్తి చేస్తే నీళ్లు వాడుకోవచ్చు
– పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై బీఆర్‌ఎస్‌
‌- కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి పూర్తవుతుందో ?
– రిజర్వాయర్లను సందర్శించిన బీఆర్‌ఎస్‌ ‌నేతలు
– కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి

మహబూబ్‌నగర్‌,‌ ప్రజాపతంత్ర, జనవరి 6:పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 10 శాతం పనులను పూర్తిచేస్తే నీళ్లను వాడుకోవచ్చని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత  సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. ఏపీ ట్రాప్‌లో కాంగ్రెస్‌ ‌నేతలు పడిపోవద్దన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలోనే పాలమూరు ఎత్తిపోతల పనులు 90 శాతం పూర్తయ్యాయని నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. రూ.32 వేల కోట్ల పనులు బీఆర్‌ఎస్‌ ‌పూర్తి చేసిందని, రూ.27 వేల కోట్ల బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌వచ్చాక తెలంగాణ నీటి లభ్యత గురించి తెలియజేశారన్నారు. ముందే అప్రమత్తమైతే తెలంగాణ నీటి వాటాను కోల్పోయేది కాదని అభిప్రాయపడ్డారు. పాలమూరులో పడావుపడ్డ ప్రాజెక్టులపై గులాబీ పార్టీ సమరభేరి మోగించింది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌లతో కూడిన ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లపూర్‌ ‌పంప్‌హౌజ్‌, ‌రిజర్వాయర్‌, ‌వ్టటెం పంప్‌హౌజ్‌, ‌కరివెన రిజర్వాయర్లను సందర్శించారు. ప్రాజెక్టులను పడావు పెట్టిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. జూరాలకు సరాసరి 25 రోజులు వరద వస్తుందని, జూరాల ప్రాజెక్టు కడితే తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. 3 లక్షల పైచిలుకు జనం ముంపునకు గురవుతారని పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయి అన్ని రిజర్వాయర్లను నింపితే 68 టీఎంసీల నీళ్లు వస్తాయని తెలిపారు. అవసరమైతే మళ్లీ నీళ్లను నింపుకోవచ్చన్నారు. దీనివల్ల ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ నీళ్లను వాడుకుంటే ఇబ్బందని జూరాల ప్రాజెక్టు తీసుకొచ్చారని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టును కాంగ్రెస్‌ ‌నాయకులు 40 ఏళ్ల నుంచి ప్రజలకు చూపిస్తున్నారని నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం అంటే పాలమూరుకు నీళ్లు వద్దని చెప్పడమే అని స్పష్టం చేశారు. ఇంత చేసినా జూరాల వద్ద నీళ్లుండవని చెప్పారు.

ప్రజలు ఎప్పటికీ క్షమించరు

బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన మంచిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం కోల్పోయామో ప్రజలకు అర్థమైతే ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. చరిత్రలో కాంగ్రెస్‌కు స్థానమే ఉండదని.. ఎప్పటికైనా చరిత్రలో నిలిచేది కేసీఆరే అని స్పష్టం చేశారు. దొంగ మాటలు, మోసాలతో ప్రజలను ముంచాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి జీవో 24ను ఒకసారి చదువుకోవాలని సూచించారు. 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టును ఆపడమేంటని ప్రశ్నించారు. తట్టెడు మట్టి తీయకుండానే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అనేక కేసులు వేసి ఏపీ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ‌నాయకులు సహకరించారని ఆరోపించారు. జూరాల నుంచి పాలమూరుకు నీళ్లు అంటేనే పెద్ద కుట్ర అని సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి ఆరోపించారు. తప్పుల తడకగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పీపీటీ ఇచ్చారని విమర్శించారు. హరీశ్‌రావు పీపీటీతో ఉత్తమ్‌కు పవర్‌ఫుల్‌ ‌సమాధానమిచ్చారని తెలిపారు. కృష్ణా నీళ్లను తెలంగాణకు దక్కకుండా చేసేందుకే కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. నిజాం కాలంలోనే కృష్ణా నీటి కోసం అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని తెలిపారు. తుంగభద్రలో నీటి పంపకాలపై 65 టీఎంసీల కోసం 1944లోనే ఒప్పందాలు జరిగాయన్నారు. భీమా ప్రాజెక్టును యాదగిరి జిల్లాలో మొదట ప్రతిపాదించారని, ఆలమట్టిని కూడా నిజాం కాలంలోనే ప్రతిపాదించారని తెలిపారు. పాలమూరుకు 174 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిజాం పలు ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు. కానీ నిజాం ప్రాజెక్టులను నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. అప్పటి నుంచే తెలంగాణకు అన్యాయం ప్రారంభమైందని తెలిపారు. సిద్దేశ్వరం దగ్గర కట్టాల్సిన శ్రీశైలం ప్రాజెక్టును 86 కి. కింద కట్టారని నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. సిద్దేశ్వరం దగ్గర ఆ ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా పాలమూరుకు నీళ్లు వచ్చేవని పేర్కొన్నారు. జల విద్యుత్‌ ‌కోసం కట్టిన శ్రీశైలం నుంచి తెలుగుగంగ పేరుతో నీటిని తరలించారని అన్నారు. తెలుగుగంగ ద్వారా కడప, నెల్లూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని పేర్కొన్నారు. కృష్ణా నదిని మొత్తం మలుపుకు పోయేలా పోతిరెడ్డిపాడును చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా చేసే కుట్ర అప్పుడు జరిగిందని.. ఇప్పుడు కూడా జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్‌ ‌లేవనెత్తిన అంశం అసాధ్యమని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *