– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
– పార్టీ చేరిన ఎంఐఎం నాయకులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎంఐఎం నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటీలు ఇస్తాం.. వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికలపుడు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అయితే.. ఆ డబ్బులు తీసుకొని మిగతా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలన్నారు. ఇవి కారుకు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు కేటీఆర్. పేదల ఇండ్లు కూలగొట్టిన ఈ బుల్జోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ఆయన ధైర్యం చెప్పారు. ప్రజలకు తాము ఎప్పటికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



