– భూభారతితో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే అనుసంధానం
– ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్ రూపకల్పన
– సీసీఎల్ కార్యాలయానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః పరిపాలనా వ్యవస్ధను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫాం మీదకు తీసుకొచ్చి భూభారతి పోర్టల్ తో అనుసంధానం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆధునికీకరించిన ఈ వ్యవస్ధను వచ్చే జనవరిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నాంపల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయాన్న మంత్రి పొంగులేటి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ పరిపాలనకు కేంద్రమైన సీసీఎల్ ఏ కార్యాలయం నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్కు దీటుగా ఆధునికీకరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, అప్పటికి మార్పు కనిపించాలన్నారు. వరుసగా విభాగాల వారీగా కూడా సమీక్షిస్తానని, అధికారులు పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలని ఆదేశించారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ జరిపిందని, ఇప్పటికీ కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తుల పేరు మీదే ఉన్నాయని, వీటిని రికార్డులలో మార్చాలని, అలాగే అసైన్డ్, భూధాన్ భూములపై సమీక్షతోపాటు కొన్నేళ్లుగా ఉద్యోగులపై విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, కోర్టు కేసులన్నింటిపై పూర్తిస్ధాయి సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలు ఒకే మోడల్గా ఉండాలని, ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఒక్క క్లిక్తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా, అలాగే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్వోఆర్, గ్రామాల నక్షా, ఫీడ్ బ్యాక్ వంటి పూర్తి సమాచారం లభించేలా సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలతో అనుసంధానం చేస్తూ భూభారతి పోర్టల్ను పూర్తిస్ధాయిలో ప్రజలకు చేరువ చేయబో్తున్నామని తెలిపారు. ఆధార్ నెంబర్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావాల్సిన సమాచారం లభిస్తుందన్నారు. క్రయవిక్రయదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్ ను రూపొందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్ధ ఆధునికీకరణ చేసే ప్రతి పనిలో సామాన్యుని కోణం ఉండాలని, ఎలాంటి లోపాలకు, తారుమారుకు ఆస్కారం లేకుండా సాఫ్ట్ వేర్ను అభివృద్దిపరచాలని సూచించారు సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు, సీసీఎల్ఏ ఇన్ఛార్జి కార్యదర్శి మంధా మకరంద్. ఎన్.ఐ.సి. ఎస్.ఐ.ఓ ప్రసాద్, విజయ్మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే