– డిప్యూటీ సీఎం భట్టి,
– మంత్రి కోమటిరెడ్డితో కలిసి ’సివిల్ప్ అభయ హస్తం’ చెక్కుల పంపిణీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ప్రజాస్వామ్యాన్ని (democracy) నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని, ఐఏఎస్(IAS) అంటే ఉద్యోగం కాదని, సమాజం పట్ల బాధ్యత అని, ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సివిల్ సర్వీసెస్ ద్వారా అవకాశముంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhastti Vikramarka) అన్నారు. ప్రజా భవన్లో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్-2025 విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గతేడాది అభయ హస్తం పొందిన వారిలో పదిమంది ఎంపికయ్యారని, ఈఏడాది 178మందిలో ఎక్కువ మంది ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వారికి చెక్కుల పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. రాజీవ్గాంధీ సివిల్స్ అభయ హస్తం సివిల్స్లో తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలని, అందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అభ్యర్థులకు మనోధైర్యం కల్పించేందుకు ప్రభుత్వం వరుసగా రెండో సంవత్సరం కూడా కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం, ఢల్లీిలో వసతులు కల్పిస్తామన్నారు. వేలాదిమంది రాష్ట్రంలో పనిచేసినా ఎస్సార్ శంకరన్, పార్థసారధి, మాధవరావు వంటి కొద్దిమంది పేర్లు మాత్రమే జనం గుండెల్లో నిలిచిపోయాయన్నారు. ఈ కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు.





