– దిల్లీకి వెళ్లకుండా ఫామ్హౌజ్కు వెళ్లాలా
– కేంద్రంతో చర్చించకుంటే సమస్యలకు పరిష్కారమెలా?
– పక్క రాష్ట్ర సిఎంతో చర్చలు జరిపితే తప్పేంటి?
– తుమ్మడిహట్టికోసం ‘మహా’ సిఎంతో మాట్లాడుతా
– కేంద్రమంత్రికిషన్ రెడ్డి ప్రణాళికతో రావాలి
– మీడియాతో సిఎం రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై17: కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వొచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని.. వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల అనంతరం మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. తన పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై సూటిగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటైన పదజాలంతో ప్రస్తావించారు. కేంద్రంతో చర్చలు జరుపకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు సీఎం. రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను దిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. ఇండియా, పాకిస్తాన్ మధ్యే నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే, నేను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖలు రాయడం కాదని.. ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా వున్నామన్నారు. నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధా నించాలనే ప్రతిపాదన ఉంది. ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని కేసీఆర్ను కేటీఆర్ అడుగుతున్నారు. దానికి కేసీఆర్ అంగీకరించడం లేదు. సొంత వివాదాలతోనే ఆ కుటుంబానికి సరిపోతోంది. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదు. కేంద్రం పిలిచినప్పుడు వెళ్లకుండా.. కేసీఆర్ ఫాంహౌస్కు వెళ్లాలా?అక్కడికి వెళ్తే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి?హైదరాబాద్లో లోకేశ్ని కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారు? కేదార్ అనే వ్యక్తితో కలిసి కేటీఆర్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ కలగలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించాడు. ఆయన మరణంపై పూర్తినివేదిక ఉంది. మద్యంలో కాక్టెయిల్ విన్నాం.. డ్రగ్స్లో తొలిసారి కాక్టెయిల్ అని వింటున్నాం. అవసరమైనప్పుడు కేదార్ మరణానికి గల కారణాల రిపోర్టును బయటపెడతాం. ఆ రిపోర్టును అసెంబ్లీలో పెట్టడానికీ సిద్ధమే. నేను చర్చిస్తానంటోంది ప్రతిపక్ష నేత కేసీఆర్తో మాత్రమే.. కేటీఆర్తో కాదని స్పష్టం చేశారు. దిల్లీకి వెళ్లడం నేరంగా మాట్లాడుతున్నారు.. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతోనే మాట్లాడాలన్నారు. దిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.. ఫామ్ హౌస్ కి వెళ్ళాలా? అని ఫైర్ అయ్యారు. 33, 34 సార్లు దిల్లీకి వొచ్చానని.. 48 సార్లు వొచ్చానని మాట్లాడుతున్నారన్నారు. తన ప్రియారిటి రాష్ట్రమని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ , వివాదాలను పరిష్కరించుకోవడం ముఖ్యమన్నారు. వ్యూహంతో పని చేస్తున్నామని.. గత ప్రభుత్వం సాధించనివి ఎన్నో.. తాను సాధించానన్నారు. దిల్లీలో కేంద్రం ఉన్నప్పుడు, ఇక్కడికి వొచ్చే రాష్ట్రం కోసం మాట్లాడాలన్నారు. రాష్ట్ర అవసరాల కోసం దిల్లీతోపాటు, అవసరమైతే రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళ్తామని.. నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అక్కడ మాట్లాడుతామన్నారు.బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి చర్చలు జరగలేదని ప్రకటించిందని సీఎం తెలిపారు. అయితే, తాను ఇప్పటికే మూడు సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు. మిగిలిన సమస్యలపై అధికారులు, సాంకేతిక నిపుణుల కమిటీ చర్చిస్తుందని వివరించారు. నేను ఇంజనీర్ కాదు… సాంకేతిక అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటాం అని పేర్కొన్నారు. ప్రజలు నాకు అధికారం ఇచ్చారు.. రాష్ట్ర సమస్యలను కేంద్రానికి తీసుకెళ్లడం నా బాధ్యతని సీఎం స్పష్టం చేశారు. నెలకు ఖచ్చితంగా రెండు సార్లు దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటానని హా ఇచ్చారు.ప్రతిపక్ష నేత కేసీఆర్తో అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. కేటీఆర్ నాయకత్వాన్ని చెల్లెలే అంగీకరించడం లేదు. గతంలో సవాల్ విసిరితే పారిపోయారని అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి బ్యాచ్కి నేను భయపడను. భయపడి ఉంటే నేను రేవంత్ రెడ్డి అవుతానా? అంటూ విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుందని, కేటీఆర్ డ్రగ్స్ కేసుపై, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుందన్నారు. కిషన్ రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై సవాల్ విసిరిన రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీబీఐ కేసుల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. రెండేళ్ల తర్వాత కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులను మళ్లీ భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుంది. కాలేశ్వరం, ఫోన్ టాపింగ్, హెచ్ఎండిఏ ఎన్నో కేసులో విచారణ జరుగుతుంది. ఫోన్ టాపింగ్ కేస్ హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు హైకోర్టుకు వివరిస్తున్నాం. ప్రభాకర్ రావు ఇండియాకు ఆలస్యంగా రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే.. కేంద్రం ఎందుకు ప్రభాకర్ రావును తీసుకురాలేదని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో ఏం తప్పులున్నాయో ఎత్తి చూపించండి. రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులను ఈడీ తీసుకుంది. ఈ కేసుల విచారణలో పురోగతి ఎందుకు లేదో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ దిల్లీకి వెళ్లవచ్చు. రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తానంటే ఎవరూ అడ్డుకోరు. గతంలో డ్రగ్స్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది నేను కాదు. ఛాలెంజ్ చేయడం… కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం కేటీఆర్కు అలవాటే. శాఖాపరమైన విచారణలు రాత్రికి రాత్రి పూర్తికావని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై మాకు వ్యూహం ఉంది. 50 శాతం రిజర్వేషన్లు వద్దని 2018లో పంచాయతీరాజ్ చట్టంలో కేసీఆర్ మార్పులు చేశారు. 2014కు ముందు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారు. రిజర్వేషన్ల కుదింపును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. దీనిపై అవగాహన లేకుండా చాలా మంది మాట్లాడుతున్నారు. ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వారికి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసిన తర్వాతే కిషన్రెడ్డి మాట్లాడాలని రేవంత్రెడ్డి అన్నారు.




