– మహిళలకు సీఎం రాఖీ పండుగ శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను శనివారంనాడు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతోపాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందన్నారు. గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ మహిళలకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. అక్కచెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.





