– దిల్లీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ఆగస్టు 6: బీసీ రిజర్వేషన్ల బిల్లును (BC Reservation bill) ఆమోదించటానికి ఇండి కూటమి కృషి చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి *(CM Revanth Reddy) తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ దిల్లీలో కదం తొక్కారు. ఈ మేరకు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుకు ధర్నా చేపట్టారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు వదలం అని నినాదాలు చేశారు. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి దిల్లీ దాకా పోరాటం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. ఇంతవరకు రాష్ట్రపతి బిల్లును ఆమోదించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇండి కూటమి (INDIA) మద్దుతు ఇస్తోందని పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడిగాం కానీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ తరహాలో దేశంలోనూ జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వొద్దని మోదీ, అమిత్షా చెప్పి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీసీ బిల్లు ఆమోదించకుంటే ప్రధాని మోదీని గద్దె దించుతామని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రానికి బిల్లు పంపి నాలుగు నెలలవుతున్నా ఆమోదించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తున్నా కేంద్రానికి కనువిప్పు కలగడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ముస్లింల కోసం కాదు.. బలహీన వర్గాల కోసం అని స్పష్టం చేశారు. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.





