– పంచాయతీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామంలో వందల కోట్ల విలువైన 112 ఎకరాల భూమిలో వేసిన లేఔట్, అందుకు అధికారుల నుంచి పొందిన అనుమతుల వివరాలు ఇవ్వాలని సదరు గ్రా పంచాయతీకి హైకోర్టు నోటీసులిచ్చింది. చిప్పలతుర్తిలో సర్వే నెం. 58/1 నుంచి 5, 12, 59/30, 31, 32, 40లోని 112 ఎకరాల భూమి విషయంలో చట్టవిరుద్ధమైన ఎంట్రీలు నమోదుపై దర్యాప్తు జరపాలంటూ ఉన్నతాధికారులకు ఏప్రిల్ 15న ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చినప్పటికీ చర్యలు లేవంటూ జి. అశోక్ ఇతరులు పిటిషన్ వేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం విచారించి గ్రామ పంచాయతీకి నోటీసులిచ్చారు ఆ భూమి విషయంలో కలెక్టర్ 2020లో ఇచ్చిన ప్రొసీడింగ్స్ మేరకు అక్రమ పద్ధులు నమోదయ్యాయని న్యాయవాది చెప్పారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే వినతిపత్రంపై చర్యలు లేవన్నారు. ప్రభుత్వంతోపాటు కలెక్టర్ తదితరులకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదన్నారు. లేఔట్, దానికి ఉన్న అనుమతుల వివరాలపై పంచాయతీ వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.





