– ఆహ్వాన పత్రిక అందజేసిన చితంమడక మహిళలు
– కేసీఆర్లాంటి గొప్ప వ్యక్తిని కన్న గొప్ప ఊరు
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్యేగం
=సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు రావల్సిందిగా బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(కేసీఆర్) సొంతూరైన సిద్ధిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామస్థులు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను గురువారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ నెల 21న ప్రారంభం కానున్న ఎంగిలిపూల బతుకమ్మకు రావల్సిందిగా గ్రామానికి చెందిన పలువురు మహిళలు, గ్రామ పెద్దలు కవితకు ఆహ్వాన పత్రికను అందజేశారు. శాలువాతో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా కవితను కలిసిన ప్రతి మహిళను ఆప్యాయంగా పలకరించడమేకాక ఆలింగనం చేసుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు చింతమడకకు రావల్సిందిగా ఆహ్వానించిన గ్రామానికి చెందిన మహిళలు, గ్రామ పెద్దలతో కవిత చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు రావల్సిందిగా చింతమడక నుంచి ఇంత పెద్ద సంఖ్యలో వొచ్చి ఆహ్వానించడం తనకెంతగానో సంతోషంగా ఉందన్నారు. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. తన చిన్నప్పుడు చింతమడకలో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కండ్ల ముందే ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.. ఈ సమయంలో మీరంతా వొచ్చి తనకు ఇచ్చింది మామాలు ధైర్యం కాదన్నారు. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజుల కిందటనే కవితను బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కవితను కేసీఆర్ సొంతూరుకు చెందిన మహిళలు, గ్రామ పెద్దలు ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





