– దిల్లీలోనే మకాం వేసిన సిఎం రేవంత్
- శాఖల కేటాయింపులపై కసరత్తు
– కెసి వేణుగోపాల్, ఖర్గేలతో సిఎం మంతనాలు
– హుటాహుటిన దిల్లీకి మంత్రి ఉత్తమ్
- శాఖల కేటాయింపులపై కసరత్తు
– కెసి వేణుగోపాల్, ఖర్గేలతో సిఎం మంతనాలు
– హుటాహుటిన దిల్లీకి మంత్రి ఉత్తమ్
తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పులపైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండురోజులుగా దిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన దిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇకపోతే సోమవారం కాంగ్రెస్ కార్యదర్శి కేసీ వేణుగోపాలతో గంటకుపైగా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బేటి అయ్యారు. ఖర్గేతో భేటీ తరువాత మంత్రుల శాఖల మార్పులు ఖరారు కానున్నాయి సమాచారం. అలాగే కొత్త మంత్రులకు కూడా శాఖల కేటాయింపు జరుగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం వివిధ శాఖలను నిర్వహిస్తున్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులే కాదు.. శాఖల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత నివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదంటూ ఇప్పటికే కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి నివేదించారు.
అలాగే మంత్రుల పనితీరుపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వివిధ స్థాయి నేతలతో భేటీలో అందిన సమాచారం ఆధారంగా ఆమె నివేదికలు రూపొందించారు. కీలక శాఖల బాధ్యతలన్నీ కొందరు మంత్రులే నిర్వహిస్తుండటంతో పని భారం కారణంగా కొన్ని శాఖల్లో ఆశించిన ఫలితాలు రావట్లేదనే అంచనాలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు. మంత్రుల పనితీరు వ్యవహార శైలిపై కేసి వేణుగోపాల్ గతంలోనే దిల్లీలో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, మంత్రుల వ్యవహార శైలి, పనితీరుపై తన అంచనాలను అధిష్టాన ముఖ్యులతో సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు. విద్య, మున్సిపల్ పట్టణాభివృద్ధి, హోం, న్యాయం సహా పదికి పైగా కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను విడగొట్టి మున్సిపల్ శాఖను మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది. కాగా తనకు విద్యుత్తు లేదా విద్యాశాఖ ఇవ్వాలని వివేక్ కోరుతున్నారు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వద్ద విద్యుత్ శాఖ ఉంది. త్వరలో కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హస్తినలో కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం దిల్లీలోని ఇందిరా భవన్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి దాదాపు గంటసేపు చర్చించారు. మంత్రులకు శాఖల కేటాయింపుపైనే ప్రధానంగా వీరి చర్చ సాగినట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరెవరి దగ్గర ఏయే శాఖలున్నాయి? రెండు, మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారెవరు? కొత్తగా మంత్రివర్గంలో చేరిన వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్కు ఏ శాఖలు కేటాయించాలి? అనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన జాబితాను కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్ అందించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలను కొత్తవారికి కేటాయించే అంశంపై సమాలోచన జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. అందులో ప్రధానమైనవి.. విద్య, పురపాలకం, హోం, గనులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వాణిజ్య పన్నులు, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, క్రీడలు యువజన శాఖ. వీటిలో విద్యా శాఖను తనకు కేటాయించాలని గడ్డం వివేక్ కోరుతున్నట్టు- తెలిసింది. ఇదే విషయాన్ని మల్లికార్జున ఖర్గేకు సైతం తెలియజేసినట్టు సమాచారం.
అయితే, వివేక్కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టు- జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన వారి ప్రభావమెంత వారిని శాంతింపజేయడం ఎలా అనే అంశాలపై కూడా కేసీ, రేవంత్ రెడ్డి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రివర్గంలో మరో ముగ్గురికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగిలిన వారికి ఈసారి చోటు- కల్పిస్తామనే నమ్మకం కలిగించాలని రేవంత్ రెడ్డికి కేసీ సూచించినట్టు తెలిసింది. అలాగే ప్రస్తుతం కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారి వ్యవహారశైలి, పనితీరు తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నట్టు- సమాచారం. ఈ నేపథ్యంలో ఒకరిద్దరి మంత్రుల శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తమ్కు పిలుపు రావడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఉత్తమ్ నీటిపారుదలతో పాటు పౌరసరఫరాల శాఖ నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన శాఖల్లో మార్పులు జరగవచ్చని అంటున్నారు.




