తెలంగాణ సొమ్ముతో కేర‌ళ‌లో ప్ర‌చారం

– మ‌రోవైపు ఖ‌జానా ఖాళీ అంటూ దుష్ప్ర‌చారం
– తెలంగాణ‌ను ఏటీఎంగా మార్చిన దుర్మార్గ‌పు స‌ర్కారు
– కేర‌ళ పేప‌ర్‌కు ఫుల్‌పేజీ యాడ్‌
-హ‌రీష్‌రావు ఆగ్ర‌హం

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6:  ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని బీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ  రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రమైన కేరళలో మాత్రం వందల కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని నీళ్లలా పారబోస్తున్నారని ఆరోపించారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ఫోటోలతో ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్స్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారిందని అర్థమవుతోందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇక్కడ ప్రజల గొంతు కోసి, కేరళలో కలర్ పేజ్ యాడ్స్ ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు ప్రతి ఇంటి గడప నుంచి మొదలయ్యాయి. మహాలక్ష్మి పేరిట ప్రతి నెలా 2500 ఇస్తామని మహిళలను మహా మోసం చేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం జాడ లేదు. కాలేజీ పిల్లలకు ఇస్తామన్న స్కూటీల ముచ్చటే లేదు. ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డల కంట్లో మట్టికొట్టి.. కేరళ పత్రికల్లో మాత్రం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశాం అని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డల కడుపు కొట్టింది ఈ పాపపు సర్కార్.. నిరుద్యోగ యువతకు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్, ఏటా 2 లక్షల ఉద్యోగాలు అని ఊదరగొట్టారు. నమ్మి ఓటేసిన పాపానికి ఇప్పుడు నోటిఫికేషన్ల కోసం రోడ్డెక్కితే అశోక్ నగర్ వీధుల్లో, ఉస్మానియా క్యాంపస్ లో అర్ధరాత్రులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడుతున్నారు. చదువుకునే పిల్లలకు కనీస వసతులు లేవు కానీ ముఖ్యమంత్రి అమెరికా టూర్లకు, విమాన ఖర్చులకు మాత్రం విద్యాశాఖ ఖాతాల్లోంచి కోట్లు మళ్లించుకుంటారన్నారు. ఇక్కడ యువత భవిష్యత్తును అంధకారం చేసి కేరళలో మాత్రం తెలంగాణలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాం అని పచ్చి అబద్ధాలతో ప్రచారం చేసుకుంటున్నారు. చదువుకున్న బిడ్డల వీపులను లాఠీలతో పగలగొట్టిన రేవంత్‌ సర్కారు.. పొలాల్లో కష్టపడే రైతన్నలను కూడా వదిలిపెట్టలేదు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ అన్నదాతలను నిలువునా ముంచారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి కొర్రీలు పెట్టి సగానికి పైగా రైతులను నట్టేట ముంచారు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధును ఆపేసి.. రేవంత్ రెడ్డి వచ్చినప్పటినుండి రెండు సీజన్ల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి, మరో సీజన్‌లో అరకొరగా ఇచ్చి, ఇక ఈ సీజన్‌కి అయితే అసలు దిక్కులేదన్నారు. ఎకరానికి 15 వేల రైతుభరోసా లేదు. ప్రాణం పోతే రైతు బీమా లేదు. వరికి 500 బోనస్ అని చెప్పి కేవలం సన్నాలకే అంటూ మెలిక పెట్టి 80 శాతం దొడ్డు వడ్లు పండించే రైతుల పొట్టగొట్టారు. ఆ సన్నాలకు కూడా పోయిన పంటల బోనసు ఇంకా విడుదల చేయలేదని ఆరోపించారు. కనీసం యూరియా సరఫరా చేసే తెలివి లేదు కానీ రైతులను ఉద్ధరించినామని ఇతర రాష్ట్రాలో డబ్బా కొట్టుకుంటున్నారు. ఆసరా లేని వృద్ధులను సైతం తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది.

తాము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచే రూ.4,000 పెన్షన్ ఇస్తాం అని ఎన్నికల ముందు గొప్పగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆ మాటను పూర్తిగా గాలికొదిలేశారు. పెరిగిన పెన్షన్ వస్తుందని ప్రతినెలా ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఈ రెండున్నరేళ్లుగా నిరాశే మిగిలింది. ఇక్కడ ఆసరా కోసం ఎదురుచూసే అభాగ్యులకు, వికలాంగులకు పెంచిన పెన్షన్ ఇవ్వడానికి చేతులు రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఇక్కడి డబ్బును తీసుకెళ్లి కేరళ మలయాళ పత్రికల్లో తెలంగాణలో సంక్షేమ పండుగ అని అబద్ధపు యాడ్స్ ఇచ్చుకోవడానికి చేతులు ఎలా వచ్చాయ‌ని ప్ర‌శ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ను చెల్లించడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో మాత్రం తమది అద్భుత పాలన అని పబ్లిసిటీ చేసుకుంటుంద‌ని ఎద్దేవా చేశారు. ఈ ప్రజాధనం దోపిడీ కేవలం ఒక్క కేరళకే పరిమితం కాలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, హర్యానా.. ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఫేక్ పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మునే వాడుకుంటున్నారు. ఇక్కడ కమీషన్ల రూపంలో దండుకుంటున్న వేలాది కోట్లను ఇతర రాష్ట్రాల ఎన్నికలకు మళ్లిస్తున్నారనేది బహిరంగ రహస్యం. అధిష్టానాన్ని మెప్పించడానికి ఖజానాను పార్టీకి అక్షయ పాత్రగా మార్చారన్నారు. ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అడుగడుగునా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అమలు కాని పథకాలను అమలవుతున్నట్లు కేరళలో యాడ్స్ ఇవ్వడం వారి మోసపూరిత ధోరణికి నిదర్శనమ‌న్నారు. తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ పబ్లిసిటీ కోసం ఇతర రాష్ట్రాల్లో తగలెయ్యడానికి మీకేం హక్కు ఉంది.. స్వరాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడవలేని రేవంత్ రెడ్డి పరాయి రాష్ట్రాల్లో ఫేక్ పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేయడం శోచనీయమ‌న్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని ఈ సందర్భంగా కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయనలో ఇంకా నైతికత మిగిలి ఉన్నా ఇతర రాష్ట్రాల్లో ప్రజాధనంతో చేసే ఈ దొంగ ప్రచారాలు తక్షణమే ఆపాలి. ఆ యాడ్స్ కోసం ఖర్చు చేసిన వందల కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *