– కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్
– డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
వొచ్చే జనవరి 15 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. 2022 అక్టోబర్ లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతుల పై స్టే ఇవ్వగా దాదాపు రెండు సంవత్సరాల పాటు నాటి పాలకులు యాదాద్రి పవర్ ప్లాంట్ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల పెట్టుబడి తో ప్రారంభించిన పరిశ్రమ ఒక్కరోజు ఆలస్యమైనా ఆర్థిక భారం తీవ్రంగా రాష్ట్ర ప్రజలపై పడుతుందన్నారు. అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగా వెనువెంటనే 2024 ఫిబ్రవరిలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి పర్యావరణ అనుమతులను వెంటనే తీసుకువొచ్చామని ఆయన వివరించారు.
please subscribe our channel youtube.com/@prajatantra-news
ఆనాటి నుంచి రోజువారిగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ ప్రతి వారం ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులకు క్యాలెండర్ లో నిర్దేశించి ఆ మేరకు పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆ క్రమంలోనే ఇప్పటికే రెండు యూనిట్లను జాతికి అంకితం చేశామన్నారు. ప్రతివారం నిర్దేశించుకున్న పని పూర్తి కాకపోతే ఎందుకు కాలేదని సంబంధిత అధికారులను, ఇంజనీర్లను ప్రశ్నించి పనిని ముందుకు తీసుకుపోయామని తెలిపారు. వీటితోపాటు పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేసేందుకు రైల్వే లైన్, కార్మికులు అధికారులు ఉండేందుకు టౌన్ షిప్ ఏర్పాటు ఇవన్నీ నిర్దేశిత సమయాన్ని నిర్ణయించుకొని ముందుకు పోతున్నామన్నారు. బీహెచ్ఈఎల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పరిసరాల్లోని గ్రామాల్లో ప్రపంచ స్థాయి విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా సీఎస్సార్ నిధుల నుంచి అందజేస్తామని భరోసా ఇచ్చారు





