తెగిపోయిన రోడ్డులో దిగబడిన ముందు చక్రాలు
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: అమర రాజా బ్యాటరీ కంపెనీకి చెందిన బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 44 నెంబరు జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఐటీ టవర్ వద్ద రోడ్డు దెబ్బతిని తెగిపోయింది. అమర రాజా బ్యాటరీ కంపెనీ బస్సులో ఉద్యోగులను తరలించే క్రమంలో గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుందని రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ తెలిపారు. బస్సులో దాదాపు 30మంది ఉద్యోగులు విధులను ముగించుకొని తిరుగు ప్రయాణమవగా భారీ వర్షం కారణంగా తెగిపోయిన రోడ్డులో బస్సు ముందు చక్రాలు దిగబడ్డాయి. డ్రైవర్ అప్రమత్తతో బస్సును నిలిపివేశారని, అత్యవసర ద్వారం నుంచి బస్సులోని కంపెనీ సిబ్బంది దిగిపోయారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు.
కంపెనీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం





