ఒకరి స్క్రిప్టు మరొకరు చదువుతారు
వారికి ప్రజల పట్ల చిత్తశుద్ధ్ది లేదు
మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు
బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, లోపాయకారిగా వారి వ్యవహారాలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకరి స్క్రిప్టును మరొకరు చదువుతారని అన్నారు. జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ, బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని అన్నారు. ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో తప్పులేదు. కానీ విమర్శలు చేస్తే వాటికి నిజాయితీ ఉండాలి. ప్రజలు అన్నం తినలేదన్నట్టు బిల్డప్ ఇవ్వడం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి.. సీతారామ ప్రాజెక్టుకు కరెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉండే ప్రభుత్వం ప్రజల అవసరాలపై ఎంత చిత్తశుద్ధితో పని చేసిందో చెప్పకనే చెప్పిందని అన్నారు. భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, కానీ తాత్కాలికంగా నగదు రూపంలో సాయం అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. రెండు మూడు రోజుల్లో అందరికీ సాయం అందుతుంది. స్థలాలు పోతున్న వారికి పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి బలహీనంగానే ఉన్నా, సుమారు రూ.680 కోట్లతో 16-17 కిలోటర్ల రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 9 కిలోటర్ల పనులు మొదలయ్యాయి. రెండు పక్కల డ్రెయిన్, బీటీ రోడ్ కూడా నిర్మిస్తున్నారు అని అన్నారు. గత ఆగస్టులో మున్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు వరదల్లో ఇబ్బంది పడ్డాయని, సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, నేను, భట్టి విక్రమార్క కలిసి ఐదు ఆరు రోజులు అక్కడే పర్యవేక్షించా మన్నారు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలాగా జీవో ఇవ్వడంలో కాదు.. పనులు మొదలు పెట్టడంలో నిబద్ధత చూపుతోంది అన్నారు. ఇల్లు కోల్పోయిన పేదలకు స్థలాలు, ఇళ్లు అందిస్తాం. ఇరిగేషన్ భూములు ఉన్నవారు వాటిని ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా మా కుటుంబ సభ్యులేనని అన్నారు. సమస్యలను ఒప్పుకోకుండా ఎదుర్కోవడం సరైన పద్ధతి కాదు అని వ్యాఖ్యానించారు.



