కమీషన్లతోనే కాంగ్రెస్ పాలన సాగుతుందని బీఆర్ఎస్ సభ్యులు అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం కేటీఆర్ మాట్లాడిన తర్వాత భట్టి కేటీఆర్ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు వద్దురా నాయనా 20 పర్సంట్ పాలన అంటూ.. అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఇది పర్సంటేజ్ల పాలన అంటూ బీఆర్ఎస్ నినాదాలు చేశారు. ఇదేమి ప్రభుత్వం.. 20 శాతం, 30 శాతం పర్సంటేజీల ప్రభుత్వం అని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సచివాలయంలో కమీషన్లపై, కాంట్రాక్టర్ల ధర్నా గురించి కేటీఆర్ ప్రస్తావించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. భట్టి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.




