– పట్నం ఛైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నిక
– క్యాతన్పల్లి ఛైర్పర్సన్గా సంధ్యారాణి
– రెండుచోట్లా ఎన్నికకు దూరంగా ఉన్న కాంగ్రెస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా టేకుల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా భాజపా కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని కూడా గులాబీ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ పదవిని సీపీఐ అభ్యర్థి సరిత దక్కించుకున్నారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికపై కొన్ని రోజులుగా నెలకొన్నఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఈ ఎన్నికలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ 55 రోజులు క్యాంప్ నిర్వహించిందని ఆరోపించింది. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నిక నిర్వహించడం సరైనది కాదని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల పక్రియ కొనసాగింది. ఈ ఎన్నికలో సుదర్శన్ రెడ్డి ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున ఆకుల యాదగిరి పేరును ప్రతిపాదించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను చేతులు ఎత్తే విధానంలో నిర్వహించారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ ఈ మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. గతంలో అనేక విధాలుగా గొడవలకు కారణంగా మారిన క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని అధికారిక కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. సీపీఐ మద్దతుతో ఆమె చైర్పర్సన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో శనివారం క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించారు. చైర్పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు.
—————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.