– కెసిఆర్తో అగ్రనాయకుల మంతనాలు
– కవిత వ్యాఖ్యలపైనా చర్చ జరిగినట్లు సమాచారం
– పార్టీ సోషల్ మీడియా నుంచి కవిత పిఆర్వో తొలగింపు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్కు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. కవిత వ్యాఖ్యలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు సిబిఐ విచారణ ఆదేశాలతో ఉదయం నుంచి మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్హౌస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ఎర్రవల్లి చేరుకున్నట్లు సమాచారం. మరికొందరు నేతలు ఫామ్హౌస్కు బయలుదేరారు. అయితే ఇప్పటివరకు కవిత బీఆర్ఎస్లో ఉందా లేదా అన్నదానికి నేటితో తెరపడిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కవితపై పార్టీ ఎలాంటి చర్య తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు కేసీఆర్తో సమావేశమయ్యారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావుకు మద్దతుగా పార్టీ ఎక్స్లో పోస్టు చేసింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు అంటూ రాసుకొచ్చింది. సింహం సింగిల్గానే వస్తుందంటూ హరీశ్రావునుద్దేశించి పోస్టు చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని పేర్కొంది. మరోవైపు పార్టీ అధికారిక వాట్సప్ గ్రూప్ల నుంచి కవిత పీఆర్వోను పార్టీ తొలగించింది. కవిత ప్రెస్నోట్, వీడియో క్లిప్పులను సైతం వాట్సప్ గ్రూప్ల నుంచి తొలగించింది. అంతేకాక హరీష్ రావు, సంతోష్కు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల సారాంశాన్ని కూడా డిలీట్ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





