రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
సికింద్రాబాద్, ప్రజాతంత్ర, జులై 14: బోనాలు పండుగ సందర్భంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమాలలో ఒకటైన సంప్రదాయ రంగం సోమవారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సంవత్సరం భవిష్యవాణిలో దైవవాణి మాతంగి స్వర్ణలత తీవ్ర ఉద్వేగభరితమైన హెచ్చరిక స్వరాన్ని వినిపించింది. తొలుత ప్రజల భక్తికి ప్రశంసలతో ప్రారంభించింది. తనకు కానుకలు సమర్పిస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడతాయని, పాడిపంటలతో ప్రజలు తులతూగుతారని చెప్పింది. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపింది. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పింది.





