మక్తల్‌లో బీజేపీ వార్డు సభ్యుడి ఆత్మహత్య

– ఆ వార్డులో ఎన్నిక వాయిదా

మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప (43) మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 6వ వార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలు ముగ్గురు సొంత అన్నదమ్ములనే రంగంలోకి దించాయి. ఇందులో బీజేపీ నుండి మహదేవ్, కాంగ్రెస్ నుంచి అతడి అన్న పోటీలో ఉండగా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన వారి తమ్ముడు నామినేషన్ ఉపసంహరణ రోజున పోటీ నుంచి తప్ప్పుకున్నాడు. పోటీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అయితే, నిన్నటి నుంచి డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుండడంతో 6వ వార్డులోనూ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులు కోరినట్లు సమాచారం. తాను రూ.లక్ష మాత్రమే ఖర్చు చేయగలను.. ఇక తన వల్ల కాదని సోమవారం పార్టీ శ్రేణులకు ఆయన తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన మహదేవప్ప తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహదేవప్ప ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఆ వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మహదేవ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రత్యర్థుల వేధింపులతోనే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *