– బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్తారని..
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఇక్కడకు రామచందర్రావు వెళ్తారనే సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను హౌస్ అరెస్టు చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ దుండగుడు ఆలయాన్ని ధ్వంసం చేయడం వివాదాస్పదమైన సంగతి విదితమే. మరోవైపు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో రామచందర్రావు పర్యటించాల్సి ఉంది. కాగా, రాంచందర్ రావు హౌస్ అరెస్టును పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జి ఎన్.వి.సుభాష్ తీవ్రంగా ఖండిరచారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొనకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేసి గృహనిర్బంధాలు అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని శవపేటికలో పెట్టిన అనేక ఘటనలు రాష్ట్రం చూసింది.. ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ అణచివేత పాలనను కొనసాగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజ్యాంగ విలువలకు తిలోదకాలివ్వడమేనని అన్నారు.





