– జగిత్యాల నుంచే మొదటి అడుగు ప్రారంభం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 30ః రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వేస్తున్న మొదటి అడుగు జగిత్యాల నుంచే ప్రారంభమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయ శంఖారావ సభలో ఆయన ్రపసంగించారు. రెండున్నరేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై పెద్ద పెద్ద మాటలు చెప్పారు. వంద రోజుల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపి దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని. కేసీఆర్ కోసం అదే జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కూడా ఆయన చెప్పారు. కానీ నేడు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండేళ్లుగా విచారణ పేరుతో నత్తనడకన సాగుతోంది తప్ప అసలు దోషులను పట్టుకున్న పరిస్థితి లేదు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన తండ్రి, కొడుకు, బావ ముగ్గురూ స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. ఆ కేసు నుంచి ఆయనను రక్షించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య సంధి కుదిరింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో అసలు దోషులను రక్షిస్తోంది అని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పదకొండేళ్లల్లో రాష్ట్రానికి సుమారు రూ.12 లక్షల కోట్లతో అభివృద్ధి చేపట్టింది. కానీ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బుల్లేవని, జీతాలకే డబ్బులు లేవని చెబుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో అనేక అబద్ధపు హామీలు ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేసింది అని తీవ్రంగా దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకున్న దారిలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బొగ్గు కుంభకోణానికి పాల్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే కుంభకోణాల్లో మునిగిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నారు.. కట్టించకుండా మోసం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం చేస్తోంది. అసలు కడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నాణ్యత కూడా సరిగా లేదు. అందుకే నేను ప్రజలను స్పష్టంగా కోరుతున్నాను.. సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బీజేపీ. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం అని హామీ ఇచ్చారు. జగిత్యాల, రాయికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురుతుంది. త్వరలోనే రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని రామచందర్రావు అన్నారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, మోరపల్లి సత్యనారాయణ, వెంకటేష్ నేత, బోగ శ్రావణి, గడ్డం శ్రీనివాస్ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండా లక్ష్మణ్ తమ అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. వారికి రామచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


