– షాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద కార్గిల్ విజయ్ దివస్ 5కే రన్
– మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హౖాెదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి తమ పరాక్రమంతో కార్గిల్ యుద్ధంలో భారత్ పాకిస్తాన్పై విజయం సాధించడంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా షాపూర్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద 5కె రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 1999లో కార్గిల్ ప్రాంతం నుంచి పాకిస్థాన్ ఉగ్రవాదులు, చొరబాటుదారులు భారత దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని, ఈ దాడిని భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొందని తెలిపారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో భారత సైన్యం శత్రువులను తిప్పికొట్టి కార్గిల్లోని భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుందని, ఈ యుద్ధంలో మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారని, వారి ధైర్యం, వీరత్వాన్ని ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా బీజేపీ, బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రామచందర్రావు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా అందరం భారత వీరజవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నామని, చిన్న పిల్లలు కూడా పాల్గొంటూ దేశభక్తిని వ్యక్తపరుస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్లు, వైమానిక దాడులు, ఇతర ఆపరేషన్లతో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నామని, దీనివల్ల పాకిస్థాన్ పరోక్షంగా ఉగ్రవాదుల ద్వారా భారత్పై దాడులు చేస్తున్నదని తెలిబీపారు. ఇప్పుడు భారత్ మారిపోయిందని, సైనికులే కాదు ఈ దేశపు ప్రతీ యువకుడు, ప్రతీ పౌరుడు దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్గిల్ విజయ దినోత్సవం మన యువతలో ఉత్సాహాన్ని, జాతీయతను పెంపొందించేదిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





