– మహబూబ్నగర్లో బీజేపీ చీఫ్ రామచందర్రావు
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, జులై 26: మహబూబ్నగర్ జిల్లా అంటేనే వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది.. అయితే ఈ రోజు తన పర్యటనలో వర్షంతో భగవంతుడు ఆశీర్వదించడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ వలసలు తగ్గేలా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది.. కాంగ్రెస్ కూడా వలసలు నివారిస్తామన్నది.. అయినా ఇప్పటికీ పాలమూరు నుంచి బాంబేకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి అని తెలిపారు. మహబూబ్నగర్ తన పుట్టిన స్థలమని రేవంత్రెడ్డి చెబుతున్నారు కానీ ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టుల పెండిరగ్ పనులను పూర్తిచేయడం ముఖ్యమంత్రి బాధ్యత అయినప్పటికీ 19 నెలలు గడిచినా ఇక్కడి సమస్యలపై మాట్లాడడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ కుల గణన ప్రకారం బీసీలు 46 శాతం ఉండగా అందులో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని, అందులో కూడా 10 శాతం ముస్లిం రిజర్వేషన్లు పోతే బీసీలకు కేవలం 36 శాతమే ఇచ్చే కుట్రచేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తామని, బీసీలకు న్యాయం చేస్తామని రామచందర్రావు హామీ ఇచ్చారు. మోదీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు.. కానీ మత మార్పిడులు ఉండొచ్చు, కుల మార్పిడులు ఉండవని ఆయన తెలుసుకోవాలి.. ఈ విషయాన్ని రాహుల్గాంధీ చెప్పలేదేమో.. అసలు రాహుల్ గాంధీకి తన కులమేంటో తెలియదేమో అని ఎద్దేవా చేశారు. బీజేపీ బీసీ వర్గానికి చెందిన నాయకుడిని ప్రధానమంత్రిగా చేసింది. మోదీ మంత్రివర్గంలో 27మంది బీసీలు ఉన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్లో కేవలం ఇద్దరు బీసీలకే చోటు ఇచ్చిందని వెల్లడిరచారు. తెలంగాణలోని గురుకులాల్లో చదువుతున్న పిల్లలు అనేక కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు.. మరికొందరు అనారోగ్యానికి గురవుతున్నారు.. అయినా రాష్ట్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి కేంద్రం రూ.100 కోట్లు ఇచ్చింది.. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది అంటూ ప్రశ్నించారు. ఇకపై ఈ మహబూబ్నగర్ గడ్డ బీజేపీి అడ్డాగా మారుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తుందని, ఉమ్మడి జిల్లాలో ఐదు జడ్పీ స్థానాలను బీజేపీి కైవసం చేసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో యువత, మహిళలు బీజేపీని ఆదరిస్తున్నారని, రానున్న కాలంలో బీసీలకు, యువతకు, మహిళలకు రాజకీయాల్లో పెద్ద పీట వేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మనమందరం కష్టపడితే 2028 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని రామచందర్రావు అన్నారు.





