– చట్టబద్దత లోపిస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తాం
– కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం హెచ్చరిక
న్యూదిల్లీ,సెప్టెంబరు 15 (ఆర్ఎన్ఎ): అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా జరిగితే మొత్తం సర్ పక్రియను రద్దు చేస్తామని ఈసీని హెచ్చరించింది. సర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సర్ పక్రియపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.రాజ్యాంగబద్ధ సంస్థ అయినా ఎన్నికల సంఘం బీహార్ సర్ పక్రియలో చట్టం, తప్పనిసరి నియమాలను పాటిస్తుందని తాము భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. బీహార్ సర్ పక్రియపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని.. తుది తీర్పు దేశవ్యాప్త సర్ ప్రక్రియకు వర్తిస్తుందని పేర్కొంది. బిహార్ వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ను హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్లు పేర్కొంది. బిహార్లో ఈసీ చేపట్టిన వోటరు జాబితా సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై తాము అసంపూర్తి అభిప్రాయాలు వెల్లడించలేమని..అక్టోబర్ 7న తుది వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరిస్తామని అత్యున్నత న్యాయస్తానం స్పష్టం చేసింది. బిహార్ సమగ్ర ప్రత్యేక సవరణలో ఆధార్ను కూడా కచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్కు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు సూచనలు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు ఆధార్ను గుర్తింపు కార్డుగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని ఫిర్యాదులు వొస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఎన్నికల కమిషన్ చూపిస్తున్న అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆధార్ పౌరసత్వాన్ని నిరూపించలేక పోయినప్పటికీ.. అది ప్రజల గుర్తింపుకు చట్టబద్ధమైన రుజువుగా మిగిలిపోయిందని స్పష్టం చేసింది. కాగా బిహార్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వోటరు జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ పేరిట బీజేపీతో కలిసి వోట్ల చోరీకి ప్రయత్నిస్తోందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో ఇదే విధంగా వోట్ల చోరీ జరిగిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయంలో ఆధారాలను ప్రజలముందుకు తీసుకువచ్చామని..త్వరలో మరిన్ని ఆధారాలతో ఈసీ చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను బయటపెడతామని హెచ్చరించారు.
వక్ఫ్ సవరణ చట్టంపై ‘సుప్రీమ్’ కీలక ఆదేశాలు
న్యూదిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం-2025లో కీలక ప్రొవిజన్ను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్(సవరణ)చట్టం-2025పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలని దాదాపు 100కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తిని మెల్లగా లాగేసుకొనేందుకే అని వీటిల్లో ఆరోపించాయి. ఇక కేంద్రం మాత్రం పబ్లిక్, ప్రైవేటు ఆక్రణలకు గురికాకుండా రక్షించడానికి అని వాదించింది. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్లో పార్లమెంట్ ఈ బ్లిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది. ముఖ్యంగా కోర్టులతో వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి, వ్యక్తులు, డీడ్ల ఆధారంగా వక్ఫ్ అయిన ఆస్తుల డీనోటిఫై అధికారాలను దీనిలో ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





