బీహార్‌లో అభివృద్ధికే పట్టం కట్టారు

– తెలంగాణలో డబ్బులు పంచి గెలిచారు
– రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత విస్తరిస్తుంది
I బీహార్‌, జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: బీహార్‌లో ఎన్డీయే ప్రభంజనం కనబడుతోందని, ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం ఇక్క‌డ మీడియాతో మాట్లాడుతూ రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని వద్దనుకుని అభివృద్ధిని కోరుకున్నారన్నారు. సర్వే సంస్థలు కూడా ఎన్డీయే ఈ స్థాయిలో సీట్లు గెలుస్తుందని ఊహించలేదనుకుంటామన్నారు. మోదీ నాయత్వంలో దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ముందుకెళ్తోందని, బీహార్‌ ఎన్నికల ఫలితాలు వీటిని ప్రతిఫలించాయని చెప్పారు. హర్యాణా, తర్వాత మహారాష్ట్ర, ఇప్పుడు బీహార్‌ ఫలితాలను చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో ప్రజలు మంగళం పాడేశారని నిరూపితమైందన్నారు. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పుడున్న మూడు రాష్ట్రాలు కూడా చేజారిపోవడం ఖాయమన్నారు. ఎన్నికల కమిషన్‌ను విమర్శిస్తే ఓట్లు పడవనే విషయాన్ని కాంగ్రెస్‌ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. దేశంలో అక్రమంగా ఉన్న ఓట్లను తొలగించడాన్ని కూడా ఆ పార్టీ వ్యతిరేకించిందని విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ను మోదీ చేయరు.. ఆయా జిల్లాల కలెక్టర్లు, తర్వాత క్షేత్రస్థాయిలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఈ ప్రక్రియలో భాగస్వాములవుతారు.. దీనికి మోదీకి సంబంధేమేంటి? రాహుల్‌ గాంధీ ఎన్నికల అధికారులకు, దేశ ప్రజలకు ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

జూబ్లీహిల్స్‌లో మా ప్రయత్నం మేం చేశాం

జూబ్లీహిల్స్‌ ఎన్నికలో మేం ఏనాడూ గెలవలేదు.. కార్పొరేటర్‌ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో గెలవలేదు. అయినా తమ ప్రయత్నం తాము చేశామన్నారు. బీజేపీ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి బాధ్యత తీసుకుని ఎక్కువ కష్టపడ్డాంమని కిషన్‌రెడ్డి చెప్పారు. ఫలితాన్ని సమీక్షించుకుంటాం.. మరింత కష్టపడి పనిచేస్తాం అని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని గెలుచుకునే దిశగా పనిచేస్తామన్నారు. మజ్లిస్‌ అండతో కాంగ్రెస్‌ గెలిచిందంటూ సహజంగా ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజ్‌ ఉంటుందన్నారు. ఇది రేవంత్‌ పాలనకు రెఫరెండం కాదనే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పానన్నారు. బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌లు కోట్లకొద్ది రూపాయలను పంచాయని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలింగ్‌ బూత్‌ ముందు, ఎన్నికలకు ఒక రోజు ముందు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. దీనికి బాధ్యులెవరో తెలియదా అని నిలదీశారు. రేవంత్‌ రెడ్డి ఏం చేశాడని జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఓటేయాలని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నందుకు రేవంత్‌కు జనాలు ఓటేశారా? లేదు.. డబ్బులిచ్చి కాంగ్రెస్‌ గెలిచింది అని చెప్పారు. ఈవీఎంలు బీహార్‌లో పనిచేయలేదా? లేక జూబ్లీహిల్స్‌లో మాత్రమే సరిగ్గా పనిచేశాయా అనే ప్రశ్నకు రాహుల్‌ గాంధీ సమాధానం ఇవ్వాలన్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల ఆధారంగా 57 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించింది.. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడిరట రెండుచోట్ల గెలిచాం.. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, టీచర్లు కలిసి తమను గెలిపించారని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింతగా విస్తరిస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page