– హంగ్ అసెంబ్లీ ఏర్పడితేనే పొత్తుపై ఆలోచిస్తా
– ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితేనే మహాకూటమితో కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పూర్తి దృష్టి తమ అభ్యర్థులను గరిష్ఠ సంఖ్యలో గెలిపించడంపైనే ఉందని తెలిపారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ‘వాక్ ది టాక్’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నవంబర్ 14న ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ హంగ్ ఏర్పడితే అప్పుడు కచ్చితంగా స్పందిస్తాం. మా కూటమి అభ్యర్థులు వీల్కెనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచేలా చూడటమే మా ప్రయత్నం. ఫలితాలు వచ్చినప్పుడు బీహార్ ప్రజల తీర్పు ఎలా ఉందో చూస్తాం అని వివరించారు. బీహార్లోని ప్రతిపక్ష కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధాన భాగస్వాములుగా ఉండగా, ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ఉన్నాయి. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 19 స్థానాల్లో పోటీ చేసి ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరిపోయారు. ఈసారి ఎంఐఎం 25 మంది అభ్యర్థులను బరిలోకి దించింది. తమ పార్టీ బీజేపీకి ‘బీ-టీమ్’ అని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను అసదుద్దీన్ తీవ్రంగా ఖండిరచారు. వారు నన్ను ఓట్లు చీల్చేవాడినని, బీ-టీమ్ అని అనడంలో అలసిపోరు. కానీ నరేంద్ర మోదీ మూడుసార్లు ప్రధాని అయ్యారనే విషయాన్ని ఎవరూ మాట్లాడరు. దానికి బాధ్యులెవరు? 450-500 స్థానాల్లో పోటీ చేసి మూడుసార్లు ఓడిపోయినప్పుడు ఇతరులను నిందించడం ఎందుకు? అని ఒవైసీ ఘాటుగా స్పందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



