– పెద్దల చట్టం ధరణి, పేదల చట్టం భూ భారతి
–ప్రతి రైతుకు భూ భద్రత కల్పించడమే లక్ష్యం
– ఆరు వేల ప్రైవేట్ సర్వేయర్ల నియమించి అవసరమైన శిక్షణ ఇస్తాం
– ప్రతి రెవెన్యూ గ్రామానికి జూన్ 2 నుంచి రెవెన్యూ అధికారి నియామకం
– తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు 5 అంచెల వ్యవస్థ ఏర్పాటు
– ముప్పిరి తోట గ్రామ రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి
ప్రభుత్వ రూపొందించిన భూ భారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం – 2025 పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం దేశంలోనే 18 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని భూ భారతి చట్టం తయారు చేశామని అన్నారు. ప్రతి రైతుకు భరోసా భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు శ్రమించి, మేధావులతో చర్చించి, ఒక్క రోజు ఆలస్యం జరిగినా పేదలకు మంచి జరగాలనే తపనతో భూ భారతి చట్టాన్ని తయారు చేశామన్నారు.
భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలన్న ఆదర్శంగా ఉండే విధంగా భూ భారతి చట్టాన్నిప్రజా ప్రభుత్వం తయారు చేసిందని, దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి 3 సంవత్సరాలు గడిచినా నిబంధనలు ప్రవేశపెట్టలేదని తమ ప్రభుత్వం భూ భారతి చట్టంలో రూల్స్ ప్రవేశపెట్టిందని, వీటి ప్రకారం సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు.
పెండింగ్ ఉన్న సాదా బైనామా చట్టం సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం సాదా బైనమా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ధరణి చట్టంలో సాదా బైనమా గురించి అసలు పేర్కొనలేదన్నారు. జూన్ 2 నాటికి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, ఏటా రెవెన్యూ రికార్డు మాన్యువల్ గా రాసి గ్రామంలో నోటీసు బోర్డుపై అతికిస్తామని మంత్రి తెలిపారు. భూ సరిహద్దులతో పాటు భూమి కొలతలు పూర్తిగా వుండే విధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొని వచ్చామని అన్నారు.





