- పాలనా పరంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన బిఆర్ఎస్
- మేడిగడ్డ కుంగిందని చెబితే ఎదురుదాడి
– ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది
– రాహుల్ను ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి
– టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో భట్టి విక్రమార్క
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 8:బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంపై భట్టి విక్రమార్క మరోసారి నిప్పులు చెరిగారు. పాలన పరంగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిందని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ అంశంపై తాము మాట్లాడితే.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డ కుంగిందని వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో దోచుకోవడం వల్లే.. కేసీఆర్ రెండో సారి తన కేబినెట్లో హరీశ్ రావును అవకాశం ఇవ్వలేదని ఆయన వివరించారు. తెలంగాణలో పాలనతోపాటు ఆర్థిక పరంగా గాడిన పెడుతున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మేరకు.. అధికారంలోకి రాగానే రుణ మాఫీ చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామన్నారు. దేశంలోనే రైతులకు ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ చేసిందని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు రూ. లక్ష కోట్లు సంక్షేమ కోసం ఖర్చు చేసిందన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కుల గణన చేస్తామన్నారని.. ఆ ఇచ్చిన హా మేరకు రాష్ట్రంలో కుల గణన చేసి చూపించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల కోసం బిల్లులు తీసుకొని వచ్చామన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రిజర్వేషన్లకు ముకుతాడు వేసిందని విమర్శించారు. ఎల్లంపల్లి, నెట్టెంపాడు ,శ్రీశైలం, నాగార్జున సాగర్, దేవాదుల ప్రాజెక్టులు మనమే నిర్మించామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం దేశానికి చాలా అవసరమని భట్టి విక్రమార్క అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వ పదవిలో ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అజేయంగా ఉండేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చేపట్టే ప్రతి పనికి సీఎం రేవంత్రెడ్డితో పాటు కేబినెట్ అంతా అండగా ఉంటుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించేందుకు, సవాళ్లను ఎదుర్కొని న్యాయం చేసేందుకు ముందుకు వెళ్తున్నాం. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితిని భారత రాష్ట్ర సమితి పెట్టింది. 42 శాతం రిజర్వేషన్ బిల్లును భాజపా రాష్ట్రపతి దగ్గర ఆపింది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి, భాజపా కుట్ర దాగి ఉందని భట్టి విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





