హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్12: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హీరో విజయ్ దేవర కొండను విచారించిన సీఐడీ.. బుధవారం మరో నటుడు ప్రకాష్ రాజ్ను ప్రశ్నించింది. బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ ముందుకు ప్రకాశ్ రాజ్ రెండోసారి విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంటెంట్ ఎలా వచ్చింది.. డబ్బులు ఎవరు ఇచ్చారు.. ఎలా ఇచ్చారు,. వాటిని ఏం చేశారు అనే కోణంలో అధికారులు ప్రశ్నించారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ తాను 2016లో జంగిల్ మర్మ యాప్ ను ప్రమోట్ చేశానని, 2017లో బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ చట్టం తెచ్చిన తర్వాత ప్రమోట్ చేయడం ఆపేశానంటూ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత మంది ఎఫెక్ట్ అవుతారని అప్పుడు తనకు అవగాహన లేక చేశానని.. తెలిసిన తర్వాత ఎవరూ వాటి జోలికి వెళ్లొద్దని జూనియర్లకు చెబుతున్నట్టు ప్రకాష్ రాజ్ వెల్లడించాడు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. 2016లో ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశా. ఆ యాప్ 2017లో గేమింగ్ యాప్గా రూపాంతరం చెందింది. నా ఒప్పందాన్ని అప్పుడు రద్దు చేసుకున్నా. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పే కాబట్టి దీనిపై నేను క్షమాపణ కోరుతున్నా. సిట్ అధికారులకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్, బ్యాంకు లావాదేవీలు అందజేశా. ఎంతోమంది యువత బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు. వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది.. కష్టపడితేనే డబ్బులు వస్తాయి కాబట్టీ అందరం కష్టపడి పని చేసుకుందాం. ఈ విషయంలో నన్ను క్షమించాలి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు చేయనని ప్రకాశ్ రాజ్ తెలిపారు. బెట్టింగ్ యాప్లకు సినీతారలు, సెలబ్రిటీలు ప్రచారం కల్పించడంతో పలువురు యువకులు వాటికి బానిసలై ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ పలు ఠాణాల్లో కేసులు నమోదవడంతో వాటి విచారణకు సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా కేసుల్లో విజయ్తోపాటు సినీనటులు రాణా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు. అయితే సీఐడీ మాత్రం తెలిసి చేసినా, తెలియక చేసినా సరే తప్పే అని.. చర్యలు తప్పవని చెబుతోంది. గతంలో కూడా ప్రకాశ్ ఓ సారి విచారణకు వచ్చాడు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. వాటన్నింటినీ సీఐడీకి బదిలీ చేశారు అధికారులు. త్వరలోనే మంచు లక్ష్మీ, రానా కూడా సీఐడీ విచారణకు రాబోతున్నట్టు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





