విద్యార్థులకు డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ కార్డులు
అధికారులను ఆదేశించిన సిఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించడం వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ హాస్టల్స్ సౌకర్యాలపై చర్చించారు. రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడ నాణ్యమైన సరుకులు, విద్యార్థుల టెక్స్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, బెడ్ షీట్లు, కార్పేట్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర సామగ్రి సమకూర్చుకునేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక వారికి అందించే సరుకుల క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, అందుకు తగ్గట్టుగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులకు సూచించారు.



