– రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు
– కార్పొరేట్ స్ధాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
– పటాన్చెరులో ఇంటిగ్రేటెడ్ భవనానికి రేపు శంకుస్ధాపన
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: ప్రజలకు వేగవంతంగా పారదర్శకంగా అత్యుత్తమ సేవలదించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత రెండేళ్లుగా భ్రష్టుపట్టిన వ్యవస్ధను సంస్కరిస్తూ రెవెన్యూ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల ఏర్పాటుపై మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలను 11 క్లష్టర్లుగా విభజించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధికభారం పడకుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్ధలతో నిర్మిస్తున్నామని, ఐదు సంవత్సరాల నిర్వహాణ బాధ్యతను కూడా ఆ సంస్ధలే తీసుకున్నాయని తెలిపారు. మూడు నుంచి ఐదు ఎకరాల స్ధలంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, వివాహ రిజిస్ట్రేషన్ల కోసం మినీ మ్యారేజీ హాల్, గర్బిణీలకు, వృద్దులకు ప్రత్యేక వసతులు, విశాలమైన వెయిటింగ్ ఏరియా మహిళల కోసం ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రెచ్, వృద్దులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిప్ట్ సౌకర్యం తదితరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మిగిలిన కార్యాలయాలకు శంకుస్ధాపనలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండవ విడతలో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మిస్తామని, ఇందుకవసరమైన కార్యాచరణను సిద్దం చేయాలని సూచించారు. ఇప్పటికే తాలిమ్లో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, జూన్ 2 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో భవనానికి శంకుస్ధాపన చేశామని, పటాన్చెరు-శంకరపల్లి ప్రధాన రహదారి సమీపంలో రాజపుష్ప కనస్టక్ష్రన్ నిర్మించే ఇంటిగ్రేటెడ్ భవనానికి బుధవారం శంకుస్ధాపన చేయనున్నట్లు తెలిపారు. స్టాంప్స్ /రిజిస్టేష్రన్ శాఖలో స్లాట్ బుకింగ్, ఈ-ఆధార్ సంతకం వంటి సౌకర్యాలతో ప్రజల సమయాన్ని ఎంతో ఆదా చేశామని అన్నారు. ఈ సంస్కరణలు కేవలం కార్యాలయాల మార్పు కాక ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంస్కరణలుగా నిలుస్తాయని మంత్రి స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





